భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు దక్కని అరుదైన గౌరవం అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి దక్కింది. క్రికెట్ను విపరీతంగా ఆరాధించే భారత్లో 70 అడుగుల లియోనల్ మెస్సీ విగ్రహం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. దేశంలో ఓ ఆటగాడి పేరిట భారీ విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.
వెస్ట్బెంగాల్, కోల్కతాలోని న్యూటౌన్ యాక్షన్ ఏరియా-IIIలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మెస్సీ తన చారిత్రక 10వ నంబర్ జెర్సీ ధరించి, ఫుట్బాల్ను అదుపులో ఉంచుతున్నట్టుగా ఉన్న భంగిమలో ఈ విగ్రహాన్ని రూపొందించారు. గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా లియోనల్ మెస్సీ శనివారం వర్చువల్గా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. భద్రతా కారణాలతోనే ఈ విగ్రహాన్ని స్వయంగా మెస్సీ ఆవిష్కరించలేకపోయాడు.

దేశంలో క్రికెట్ను ఆరాధించే స్థాయిలో ఫుట్బాల్ లేకున్నా మెస్సీ భారీ విగ్రహం ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. మన దేశానికి ఏ మాత్రం సంబంధం లేని మెస్సీ మన గడ్డపై అడుగుపెడుతుంటే ఈ స్థాయిలో హడావుడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ భారత్కు ఇదేం కొత్త కాదు. గతంలో డిగో మారడోనా(అర్జెంటీనా), పీలే(బ్రెజిల్) లాంటి దిగ్గజాలు కూడా భారత్కు వచ్చినప్పుడు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. భారత్లో మెస్సీ పర్యటించడం కూడా ఇది రెండోసారి. గతంలో 2011లో వెనిజులాతో మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు కోల్కతా వచ్చాడు.
ఈ సారి అతని పర్యటన నాలుగు నగరాలకు విస్తరించింది. అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించిన తర్వాత మెస్సీకి భారత్లో క్రేజ్ రెట్టింపు అయ్యింది. హార్మోన్ల లోపంతో బాధపడినా.. గ్లోబల్ స్టార్గా ఎదిగిన మెస్సీ అభిమానులకో మార్గదర్శి. అతని జీవితం అభిమానులను తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రపంచకప్ గెలిచిన తర్వాత అతనిపై అభిమానం మరింత ఎక్కువైంది. ఎంతలా అంటే భారత క్రికెటర్లను కాదని మెస్సీ కోసం 70 అడుగుల విగ్రహం పెట్టేంత. అందుకే ఈ అర్జెంటీనా స్టార్ ఒక విదేశీ సెలబ్రెటీగా మాత్రమే భారత్కు రావట్లేదు. అభిమానుల్లో ఆట పట్ల ప్రేమను మరింత పెంచడానికి, ఫుట్బాల్ సంస్కృతికి ప్రేరణగా నిలవడానికి మన గడ్డపై అడుగుపెట్టాడు.