ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోటీపడనున్నారు. భారత పర్యటనలో భాగంగా లియోనల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్కు రానున్న సంగతి తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో జరిగే 7vs7 ఎగ్జిబిషన్ ఫ్రెండ్లీ మ్యాచ్లో మెస్సీ బరిలోకి దిగనున్నాడు. అయితే ఈ మ్యాచ్లో మెస్సీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడనున్నారు.
ఆర్ఆర్ 9 జెర్సీతో సీఎం రేవంత్ ఈ మ్యాచ్ బరిలోకి దిగుతారని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తారని చెప్పారు. మెస్సీ ఎల్ఎమ్ 10 జెర్సీతో ఆడుతారని ఆర్గనైజర్స్ పేర్కొన్నారు. మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్కు సంబంధించిన టికెట్లు జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో శుక్రవారం(నవంబర్ 28) నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ మ్యాచ్ టికెట్ల ధరలు రూ. 1700 నుంచి మొదలవుతాయి.

మెస్సీతో కలిసి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా హైదరాబాద్ రానున్నట్లు ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్రకటించారు. మెస్సీతో కలిసి కోహ్లీ, శుభ్మన్ గిల్ కూడా ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారని తెలిపారు. దిగ్గజ ఆటగాళ్లను చూసేందుకు ఇది మంచి అవకాశామని పేర్కొన్నారు.
డిసెంబర్ 13-15 వరకు మెస్సీ భారత్లో పర్యటించనున్నాడు. డిసెంబర్ 13 ఉదయం కోల్కతా ఈడెన్ గార్డెన్స్కు వెళ్లనున్న మెస్సీ.. అదే రోజు సాయంత్రం హైదరాబాద్కు వస్తారు. డిసెంబర్ 14 సాయంత్రం ముంబైలోని వాంఖడే స్టేడియానికి వెళ్తారు. డిసెంబర్ 15 మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోకి అరుణ్జైట్లీ స్టేడియాన్ని సందర్శిస్తారు. ఇప్పటికే ఈ పర్యటనపై మెస్సీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.
మరికొద్ది రోజుల్లో తన పర్యటన మొదలవ్వనుందని, భారత్ చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్పాడు. తన పర్యటనలో హైదరాబాద్ కూడా ఉండటం సంతోషకరమైన విషయమని తెలిపాడు. మరోవైపు మెస్సీకి స్వాగతం పలుకుతూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. అతని రాకపై హర్షం వ్యక్తం చేశారు.
'డిసెంబర్ 13న దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీకి హైదరాబాద్లో ఘన స్వాగతం పలికి, ఆతిథ్యం ఇవ్వడానికి నేను ఎదురు చూస్తున్నాను. ఫుట్బాల్ చరిత్రలోనే గొప్ప ఆటగాడైన మెస్సీ మన నగరానికి వస్తుండటం ప్రతీ ఫుట్బాల్ అభిమానికీ మరుపురాని క్షణం. ఈ దిగ్గజ ఆటగాడికి ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ నగరంతో పాటు ప్రజలు సిద్దంగా ఉన్నారు.'అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
'తెలంగాణ రైజింగ్' కార్యక్రమానికి లియోనెల్ మెస్సీని బ్రాండ్ అంబాసీడర్గా నియమించాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా క్రీడలు, పర్యాటకం, పెట్టుబడుల ప్రోత్సాహం, యువత భాగస్వామ్యం వంటి విషయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ అత్యంత ఇష్టమైన క్రీడ. తాను చదువుకునే రోజుల్లో ఫుట్బాల్ ఎక్కువగా ఆడేవారు. మెస్సీ రాకతో స్పోర్ట్స్ హబ్గా హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని సీఎం భావిస్తున్నారు.