అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ భారత్లో పర్యటించనున్నాడు. టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్తో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడనున్నాడు. మెస్సీ భారత పర్యటన ఖరారైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 13 నుంచి 15 వరకు మెస్సీ భారత్లో పర్యటించనున్నాడు. ముంబై, ఢిల్లీ, కోల్కతా నగరాల్లో అతను పర్యటిస్తాడని, అభిమానులను కలుస్తాడని తెలుస్తోంది. పలు ప్రమోషనల్ ఈవెంట్స్లో పాల్గొనేందుకు మెస్సీ భారత్కు వస్తున్నట్లు సమాచారం.
గత 14 ఏళ్లలో మెస్సీ భారత్కు రావడం ఇది రెండోసారి మాత్రమే. అతను చివరిసారిగా 2011లో భారత్లో పర్యటించాడు. అర్జెంటీనా ఫుట్బాల్ వరల్డ్ కప్ నెగ్గాక కోల్కతా వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. లియోనెల్ మెస్సీ రాకను ముంబై క్రికెట్ అసోసియేషన్ వర్గాలు ధ్రువీకరించాయి. 'డిసెంబర్ 14న మెస్సీ ముంబైకి రానున్నాడు. వాంఖడే స్టేడియంలో భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్, విరాట్ కోహ్లీతో క్రికెట్ మ్యాచ్ ఆడుతాడు.

ఆ రోజు గ్రౌండ్ను బ్లాక్ చేయాలని ఎంసీఏను ఓ ఏజెన్సీ కోరింది. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆ విన్నపాన్ని ఆమోదించారు. భారత దిగ్గజ ఆటగాళ్లతో మెస్సీ ఆడేలా నిర్వాహకులు ప్రణాళికలను సిద్ధం చేశారు. షెడ్యూల్ ఫైనల్ అయిన తర్వాత ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.'అని ముంబై క్రికెట్ అసోసియేషన్ వర్గాలు మీడియాకు తెలిపాయి.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసే సన్మాన కార్యక్రమంలో లియోనెల్ మెస్సీ పాల్గొంటాడని తెలుస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. కోల్కతాలోని చిన్నారుల కోసం మెస్సీ వర్క్షాప్ నిర్వహిస్తాడని కూడా తెలుస్తోంది.
అర్జెంటీనా ఫుట్బాల్ టీమ్ అక్టోబర్ లేదా నవంబర్లో కేరళలో పర్యటిస్తుందని ఆ రాష్ట్ర మంత్రి అబ్దుల్ రహిమాన్ జూన్లో తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతారని పేర్కొన్నారు. కానీ మెస్సీ డిసెంబర్లోనే భారత్కు వస్తాడని ప్రచారం జరుగుతుండటంతో కేరళకు వెళ్లడం కష్టమనే అభిప్రాయం కలుగుతోంది.