
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో మరో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. గోవాలోని పండిట్ జవహార్ లాల్ మైదానం వేదికగా నార్త్ఈస్ట్ యునైటెడ్,కేరళ బ్లాస్టర్ మధ్య గురువారం జరిగిన మ్యాచ్ కూడా డ్రా అయింది. ఆఖరి నిమిషం వరకు ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దాంతో ఈ మ్యాచ్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో ఇరు జట్ల ఖాతాలో చెరొక పాయింట్ చేరింది.
మ్యాచ్ ఆసాంతం ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. కేరళ బ్లాస్టర్కు గోల్ చేసే అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. దాంతో ఫస్టాఫ్ గోల్స్ లేకుండానే ముగిసింది. సెకండాఫ్లోనూ ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. నార్త్ఈస్ట్ యునైటెడ్ ఆటగాళ్లు పదే పదే ప్రత్యర్థి గోల్ పోస్ట్లోకి దూసుకెళ్లినా.. కేరళ బ్లాస్టర్స్ డిఫెండర్స్ తిప్పికొట్టారు. దాంతో ఇరు జట్లు గోల్ లేకుండానే ఆటను ముగించడంతో మ్యాచ్ ఫలితం తేలలేదు.