
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ ఏడో సీజన్లో మరో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. రెండు రోజుల క్రిస్మస్ బ్రేక్ తర్వాత ఈస్ట్ బెంగాల్, చెన్నాయిన్ ఫుట్బాల్ క్లబ్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్ 2-2తో డ్రా అయ్యింది. గెలుపుబాట పట్టాలన్న ఈస్ట్ బెంగాల్ కల మరోసారి నెరవేరలేదు. లాల్నజులా(13వ నిమిషం), రహిమ్ అలీ(64వ నిమిషం) చెన్నాయిన్కు గోల్స్ అందించారు. ఈస్ట్ బెంగాల్ తరఫున మాట్టి స్టీన్మన్(59, 68వ నిమిషం) రెండు గోల్స్ చేశాడు.
నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్లో.. 13వ నిమిషంలోనే చెన్నాయిన్ 1-0తో లీడ్ సాధించింది. ఈస్ట్ బెంగాల్ గోల్ సాధించలేకపోవడంతో అదే స్కోర్ వద్ద ఫస్టాఫ్ ముగిసింది. అయితే సెకండాఫ్లో బెంగాల్ ఎదురుదాడి పెంచింది. 59వ నిమిషంలో గోల్ చేసిన స్టీన్మన్.. బెంగాల్ను తిరిగి మ్యాచ్లోకి తెచ్చాడు. కానీ ఐదు నిమిషాలు తిరిగేసరికే చెన్నయన్ 2-1తో తిరిగి లీడ్లోకి వచ్చింది.
మూడు నిమిషాల తర్వాత స్టీన్ మన్ మరో గోల్ సాధించడంతో స్కోర్లు సమం అయ్యాయి. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా రెండు టీమ్స్ లీడ్ సాధించలేకపోయాయి. ఇప్పటి దాకా ఆడిన 7 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించిన చెన్నయన్కు ఇది మూడో డ్రా.. మరోపక్క ఆడిన ఏడు మ్యాచ్ల్లో నాలుగింటిలో ఓడిన బెంగాల్ ఈస్ట్కు కూడా ఇది మూడో డ్రా.