
మార్గో(గోవా): ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఏడో సీజన్లో ఏటీకే మోహన్ బగాన్ జట్టు జోరు కొనసాగుతోంది. బుధవారం ఇక్కడి జవహర్లాల్ నెహ్రు స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఏటీకే 1-0తో గోవా ఫుట్బాల్ క్లబ్పై విజయం సాధించింది. మ్యాచ్ 85వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచిన స్టార్ ప్లేయర్ రాయ్ కృష్ణ మరోసారి ఏటీకేని గెలిపించాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. ప్రత్యర్థి చేసిన గోల్ ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకున్నాయి. దీంతో ఫస్టాఫ్ 0-0తో ముగిసింది.
సెకండాఫ్లోనూ హోరాహోరీ పోరు కొనసాగడంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది అనిపించింది. కానీ 85వ నిమిషంలో దొరికిన పెనాల్టీ చాన్స్ను ఏటీకే సద్వినియోగం చేసుకుంది. దాంతో ఖాతా తెరిచిన ఏటీకే మ్యాచ్పై పట్టుబిగించింది. అప్పటికీ పట్టువదలని గోవా స్కోర్ సమం చేసే ప్రయత్నం చేసింది. 90వ నిమిషంలో గోవా ప్లేయర్ సేవియర్ గామా.. బాక్స్ బయట నుంచి గోల్ పోస్ట్లోకి అదిరిపోయే షాట్ కొట్టాడు. కానీ సమయోచితంగా స్పందించిన ఏటీకే గోల్ కీపర్ ఆన్దమ్ దాన్ని అద్బుతంగా అడ్డుకుని గోవా ఆశలపై నీళ్లు చల్లాడు. దాంతో ఏటీకే విజయం ఖాయమైంది. కాగా, లీగ్లో ఇప్పటిదాకా ఆరు మ్యాచ్లాడిన ఏటీకే నాలుగు విజయాలు ఒక డ్రా, ఒక ఓటమితో టాప్-2లో దూసుకెళ్లింది. ఆరు మ్యాచ్ల్లో 2 విజయాలు, 2 ఓటములు, 2 డ్రాలు సాధించిన గోవా ఎఫ్సీ.. టేబుల్లో ఆరో స్థానంలో నిలిచింది.