
మార్గో(గోవా): ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఏడో సీజన్లో చెన్నయిన్ ఫుట్బాల్ క్లబ్ రెండో విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్లో చెన్నయిన్ ఎఫ్సీ 2-1తో గోవా ఎఫ్సీపై గెలిచింది. చెన్నయిన్ తరఫున రాఫెల్ క్రివాలెరో(5వ నిమిషం), రహీమ్ అలీ (53వ నిమిషం) గోల్స్ చేశారు. జోర్జ్ మెండోజ(9వ నిమిషం) గోవాకు ఏకైక గోల్ అందించాడు. ఫస్టాఫ్లోనే రెండు జట్లు చెరో గోల్ చేశాయి. అయితే, సెకండాఫ్లో సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగిన రహీమ్ చెన్నయిన్కు గెలుపు గోల్ అందించాడు.
మ్యాచ్ ప్రారంభమైన 5వ నిమిషంలోనే రాఫెల్ క్రివాలెరో సూపర్ గోల్తో చెన్నయిన్కు లీడ్ అందించాడు. అయితే మరో నాలుగు నిమిషాల వ్యవధిలోనే గోవా సహచర ఆటగాడందించిన పాస్ను జోర్జ్ మెండోజ్ గోల్గా మలిచి స్కోర్లను 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. ప్రత్యర్థి చేసిన గోల్ ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకున్నాయి. దాంతో మరో గోల్ లేకుండానే ఫస్టాఫ్ ముగిసింది.
సెకండాఫ్లోనూ హోరాహోరీ పోరు కొనసాగడంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది అనిపించింది. కానీ 53 వ నిమిషంలో చెన్నయిన్ ప్లేయర్ రహీమ్ అలీ గోల్ చేయడంతో ఆ జట్టు 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం మ్యాచ్పై పట్టుబిగించిన చెన్నయిన్ మరింత దూకుడుగా ఆడింది. గోవా కూడా స్కోర్ సమం చేసే ప్రయత్నం చేసింది.
కానీ సమయోచితంగా స్పందించిన చెన్నయిన్ వారి దాడులను అద్బుతంగా అడ్డుకుని గోవా ఆశలపై నీళ్లు చల్లంది. దాంతో చెన్నయిన్ విజయం ఖాయమైంది. కాగా, లీగ్లో ఇప్పటిదాకా ఆరు మ్యాచ్లాడిన చెన్నయిన్ రెండు విజయాలు, రెండు డ్రాలు, రెండు ఓటములతో ఎనిమిదో స్థానంలో ఉండగా.. ఏడు మ్యాచ్ల్లో 2 విజయాలు, 3 ఓటములు, 2 డ్రాలతో గోవా ఏడో స్థానంలో ఉంది.