బంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఏడో సీజన్లో ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్ దూకుడు కొనసాగుతోంది. శనివారం జీఎంసీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై సిటీ ఎఫ్సీ 2-0తో కేరళ బ్లాస్టర్స్పై ఘన విజయం సాధించింది. కొత్త ఏడాదిని విక్టరీతో మొదలు పెట్టిన ముంబై.. తిరిగి టేబుల్ టాపర్గా నిలిచింది. ముంబై తరఫున ఆడమ్ లీ ఫాండ్రే(3వ నిమిషం), హుగో బుమొస్(11వ నిమిషం) గోల్స్ సాధించారు.
మ్యాచ్ మూడో నిమిషంలో దొరికిన పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచిన ఆడమ్ లీ ఫాండ్రే.. ముంబై ఎఫ్సీ ఖాతా తెరిచాడు. 11వ నిమిషంలో హుగో బుమొస్ ముంబై ఆనందాన్ని డబుల్ చేశాడు. ఫ్రీకిక్ చాన్స్ను సద్వినియోగం చేసుకున్న అహ్మద్ జాహు.. ప్రత్యర్థి బాక్స్లో ఉన్న హుగోకు బాల్ అందించాడు. దాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా హుగో గోల్ పోస్ట్లోకి పంపాడు.
ఆ తర్వాత ఇరు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో ఫస్టాఫ్ 2-0తో ముగిసింది. సెకండాఫ్లో జూలు విధిల్చిన కేరళ.. దూకుడు కనబర్చింది. కానీ ఆ జట్టు ప్రయత్నాలన్నిటినీ ముంబై సిటీ తిప్పికొట్టింది. ఇరు జట్లు ప్రత్యర్థి గోల్పోస్ట్లోకి దూసుకెళ్లినా ఫలితం లేకపోయింది. మరో గోల్ నమోదు కాకపోవడంతో ముంబై సిటీ విక్టరీ ఖాయమైంది.