బాంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఏడో సీజన్ చివరి దశలో ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్కు గట్టి షాక్ తగిలింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో జంషెడ్పూర్ ఎఫ్సీ 2-0తో ముంబై సిటీని ఓడించింది. జంషెడ్పూర్ తరఫున బోరిస్(72వ నిమిషం), డేవిడ్ గ్రాండే (90వ నిమిషం) గోల్స్ అందించారు.
టాస్ గెలిచిన ముంబై జట్టు ఎడమ నుంచి కుడికి కిక్ చేయడానికి నిర్ణయించుకున్నది. తొలి అర్థభాగంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడినా ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. సెకండ్ హాఫ్లో అటాకింగ్తో కదిలిన జంషెడ్పూర్ను ముంబై కట్టడి చేయలేకపోయింది. 72వ నిమిసంలో బోరిస్ సింగ్ గోల్ చేసి జంషెడ్పూర్కు 1-0 ఆధిక్యం తీసుకొచ్చాడు.
90వ నిమిషంలో మొన్రోయ్ ఇచ్చిన పాస్ను డేవిడ్ గ్రాండే గోల్ చేయడంతో జంషెడ్పూర్ ఆధిక్యం 2-0కి పెరిగింది. నిర్ణీత సమయం ముగిసేలోపు ముంబై సిటీ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. దీంతో జంషెడ్పూర్ 2-0 ఆధిక్యంతో విజయం సాధించింది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు మొన్రోయ్, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఫారుక్ చౌదరికి లభించింది. ఓవరాల్గా ఈ విజయంతో జంషెడ్పూర్ 24 పాయింట్లతో ఆరో ప్లేస్కు చేరింది.