గోవా: ఫుట్బాల్ ఆటలో ఉండే అసలు సిసలు మజాను అభిమానులు మరోసారి అనుభవించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐఎస్ఎల్) 2020-21 సీజన్ సెకెండ్ లెగ్ తొలి సెమీస్లో ముంబై సిటీ క్లబ్ అద్భుత విజయాన్ని సాధించింది. గోవా ఫుట్బాల్ క్లబ్తో సోమవారం జీఎంసీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై పెనాల్టీ షూట్ ఔట్లో పై చేయి సాధించి టైటిల్ ఫైట్కు దూసుకెళ్లింది.
ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. దాంతో రిఫరీ మరో 30 నిమిషాల అదనపు సమయాన్ని జోడించారు. ఆ సమయంలో కూడా ఇరు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో మ్యాచ్ ఫలితాన్ని పెనాల్టీ షూటౌట్ ద్వారా తేల్చారు. అయితే ఐదు పెనాల్టీల తర్వాత కూడా స్కోర్ 2-2తో డ్రాగా ముగిసింది. దీంతో రిఫరీ మరో 5 పెనాల్టీ షూటౌట్లకు ఆటను పెంచారు. ఆ సమయంలో ముంబై జట్టు ఒక గోల్ అదనంగా చేసింది. చివరకు పెనాల్టీ షూటౌట్లో ముంబై 6-5 తేడాతో విజయం సాధించింది. దీంతో లీగ్ విన్నర్ అయిన ముంబై సిటీ ఐఎస్ఎల్ 2020-21 ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు సావియర్ గామ, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవాన్ గొన్జాల్వెస్కు లభించింది. ఐఎస్ఎల్ చరిత్రలో ముంబై సిటీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి.