పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఏడో సీజన్ను ఓటమితో ప్రారంభించిన ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్.. ఆ మరుసటి మ్యాచ్లోనే అద్భుత విజయాన్నందుకుంది. ఫటోర్డా స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో ముంబై సిటీ ఎఫ్సీ 1-0తో గోవా ఫుట్బాల్ క్లబ్ను ఓడించింది. ఆద్యాంత హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్లో ఆఖరి క్షణంలో (90+5) లభించిన పెనాల్టీని ఆడమ్ లీ ఫోండ్రె గోల్గా మలిచి అద్బుత విజయాన్నందించాడు.
మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు దూకుడు కనబర్చాయి. ఇక బంతిని అధికభాగం తన అధీనంలో ఉంచుకున్న ముంబై.. అందివచ్చిన అవకాశాలను గోల్స్గా మలచలేకపోయింది. ముఖ్యంగా అహ్మద్ జాహూ, హ్యూగో బౌమస్, ఒగ్బెచే చక్కటి సమన్వయంతో మైదానంలో పరుగెడుతూ.. గోవాపై ఒత్తిడి పెంచారు. ప్రత్యర్థి గోల్ పోస్ట్ దగ్గరికి బంతిని తీసుకెళ్లినా... ఫినిష్ చేయడంలో సఫలం కాలేకపోయారు.
దాంతో మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లు గోల్స్ చేయలేదు. అయితే ఎక్స్ట్రా టైమ్ లాస్ట్ మినిట్లో ముంబై గోల్ చేసి మ్యాచ్ విజయంతో పాటు లీగ్లో బోణీ చేసింది. మ్యాచ్ 40వ నిమిషంలో రెడ్ కార్డ్తో గోవా ప్లేయర్ ట్లాంగ్ మైదానం వీడటంతో ఆ జట్టు 10 మందితోనే ఆటను కొనసాగించింది.
ఇక నార్త్ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ)తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో కూడా అద్భుత ప్రదర్శన కనబర్చిన ముంబై అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. గోల్స్ చేసే అవకాశాలను చేజార్చుకోవడంతో నార్త్ ఈస్ట్ 1-0తో గెలుపొందింది.