పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) 2020-21లో జంషెడ్పూర్ ఓటమి నుంచి గట్టెక్కింది. ఆదివారం జరిగిన డబుల్ హెడర్ ఫస్ట్ మ్యాచ్లో ఒడిశా 2-2 తో జంషెడ్పూర్తో డ్రా చేసుకుంది. ఆద్యాంతం ఆధిపత్యం కనబర్చిన జంషెడ్పూర్.. ఆఖరి క్షణంలో విజయాన్ని చేజార్చుకుంది. జంషెడ్ పూర్ తరఫున నెరిజుస్(12వ నిమిషం, 27వ నిమిషం) డబుల్ గోల్స్తో ఆకట్టుకోగా.. ఒడిశా తరఫున డీగో మారిసియో (77వ నిమిషం, 90+3 నిమిషం) కూడా డబుల్ గోల్స్తో జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు.
ఇరు జట్లు ఆది నుంచి హోరాహోరీగా తలపడ్డాయి. గేమ్ ప్రారంభమైన 12వ నిమిషంలోనే లభించిన పెనాల్టీని గోల్గా మల్చిన నెరిజుస్ జంషెడ్ పూర్కు 1-0తో లీడ్ అందించాడు. అనంతరం మరింత ఆధిపత్యం కనబర్చిన ఆ జట్టు ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. 27వ నిమిషంలో నెరిజుస్ మరో గోల్ సాధించడంతో ఆ జట్టు లీడ్ 2-0తో డబుల్ అయింది. ఫస్టాఫ్ బ్రేక్ సమయానికి మరో గోల్ రాకపోవడంతో జంషేడ్ పూర్ ఆధిక్యంలో ఉంది.
ఇక సెకండాఫ్లో జూలు విధిల్చిన ఒడిశా గట్టి పోటీనిచ్చింది. అయితే 74వ నిమిషంలో జంషేడ్ పూర్ ప్లేయర్ రెహెనెష్ రెడ్ కార్డుతో మైదానం వీడటంతో ఆ టీమ్ 10 మందితోనే మిగతా ఆటను కొనసాగించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఓడిశా ఆధిపత్యం చెలాయించింది. 77వ నిమిషంలో మారిసియో గోల్ చేయడంతో ప్రత్యర్థి లీడ్ 2-1గా తగ్గింది. ఇక ఎక్స్ ట్రా టైమ్లో (90+3 నిమిషంలో) మరో గోల్ చేయడంతో ఒడిశా ఊపిరి పీల్చుకుంది.