పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ 2020/21 సీజన్లో మరో మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. గోవాలోని జీఎంసీ స్టేడియం వేదికగా కేరళ బ్లాస్టర్స్, జంషెడ్పూర్ ఎఫ్సీ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ డ్రా అయింది. మ్యాచ్ ఆరంభం నుంచీ ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది.
కానీ, నిర్ణీత సమయం ముగిసేలోగా ఏ జట్టు కూడా గోల్ చేయలేకపోయింది. ఫలితంగా 0-0తో మ్యాచ్ డ్రా ముగిసింది. హీరో ఆఫ్ ది మ్యాచ్ కేరళ ప్లేయర్ సాహల్ అబ్దుల్ సమాద్కు దక్కగా డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు అదే జట్టుకు చెందిన సందీప్ సింగ్ అందుకున్నాడు.
గోల్స్ కోసం ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇరు జట్ల డిఫెన్స్ చాకచక్యంగా వ్యవహరించడంతో గోల్స్ నమోదు కాలేదు. ఈ ఫలితంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో మూడేసి విజయాలతో జంషెడ్ పూర్ ఏడో స్థానంలో కేరళ బ్లాస్టర్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాయి.
నాలుగు విజయాలతో నాలుగో స్థానంలో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ నేడు(గురువారం) బెంగళూరు ఎఫ్సీతో అమీతుమీ తేల్చుకోనుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.