పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఏడో సీజన్లో మరో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. లీగ్ మ్యాచ్లో భాగంగా గురువారం రాత్రి ఫటోర్డా స్టేడియంలో కేరళ బ్లాస్టర్స్, ఒడిశా ఎఫ్సీ మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో డ్రా ముగిసింది. ఒడిశా తరఫున మారికో ఒక్కడే రెండు గోల్స్ (45, 74వ నిమిషాల్లో) చేయగా.. కేరళ బ్లాస్టర్స్ ఆటగాళ్లు ముర్రే(52వ నిమిషంలో), గారీ హూపర్(68వ నిమిషంలో) చెరో గోల్ చేశారు.
ప్రారంభం నుంచీ హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఫస్టాఫ్ చివర 45వ నిమిషంలో మారికో గోల్ సాధించాడు. దాంతో ఒడిశా 1-0 ఆధిక్యంతో ఫస్టాఫ్ను ముగించింది. అయితే సెకండాఫ్ ప్రారంభమైన 52వ నిమిషంలోనే సహచరుడు అందించిన పాస్ను కేరళ బ్లాస్టర్స్ ప్లేయర్ ముర్రే సూపర్ గోల్గా మలిచాడు. దాంతో స్లోర్లు 1-1తో సమమయ్యాయి. బంతిని తమ నియంత్రణలోనే ఉంచుకున్న కేరళ.. 16 నిమిషాల వ్యవధిలోనే గారీ హూపర్ సాయంతో మరో గోల్ సాధించి 2-1తో ఆధిక్యాన్ని డబుల్ చేసుకుంది.
ఆ వెంటనే ఒడిశా ప్లేయర్ మారికో 74వ నిమిషంలో మరో గోల్ కొట్టడంతో స్కోర్లు మరోసారి సమమయ్యాయి. అనంతరం ఇరు జట్లు ప్రయత్నించినా మరో గోల్ రాలేదు. దాంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఒడిశా ప్లేయర్ సాహల్ అబ్దుల్ సమద్కు డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, డియాగో మారికోకు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. పాయింట్స్ టేబుల్లో కేరళ బ్లాస్టర్స్ 9వ స్థానంలో కొనసాగుతుండగా.. ఒడిశా ఆఖరి స్థానంలో ఉంది. ఇరు జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకున్నాయి.