
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఏడో సీజన్లో జంషేడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ ఎట్టకేలకు బోణీ చేసింది. సోమవారం జరిగిన ఉత్కంఠపోరులో జంషేడ్ పూర్ ఎఫ్సీ 2-1తో ఏటీకే మోహన్ బగాన్ను ఓడించింది. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న ఏటీకేకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన ఏటీకే మోహన్ బగాన్ వరుసగా మూడింటిలో గెలిచి తాజా మ్యాచ్లోనే ఓడింది. ఇక జంషెడ్పూర్ నాలుగు మ్యాచ్ల్లో రెండు ఓడి ఒకటి డ్రా చేసుకొని.. తాజా గెలుపుతో విజయాల ఖాతా తెరిచింది.
ఆఖరి క్షణం వరకు ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో జంషెడ్పూర్ తరఫున నెరిజుస్ వల్స్కిస్ (30, 66వ నిమిషాల్లో) డబుల్ గోల్తో విజయాన్నందించగా.. ఏటీకే మోహన్ బగాన్ తరఫున నమోదైన ఏకైక గోల్ను రాయ్ కృష్ణ 80వ నిమిషంలో సాధించాడు. ఆరంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 13వ నిమిషంలోనే జంషేడ్పూర్కు గోల్ చేసే అవకాశం రాగా.. ఏటీకే మిడ్ ఫీల్డర్ అద్భుతంగా అడ్డుకున్నాడు. అయితే 30వ నిమిషంలో వల్స్కిస్ బుల్లెట్ గోల్తో జంషేడ్పూర్కు లీడ్ అందించాడు. ఇక ఈ సీజన్లో ఏటీకే సమర్పించుకున్న ఫస్ట్ గోల్ ఇదే కావడం విశేషం.
స్కోర్ను సమం చేసేందుకు ఏటీకే చేసిన ప్రయత్నాలన్నిటినీ జంషేడ్ పూర్ తిప్పికొట్టడంతో ఫస్టాఫ్ 1-0తో ముగిసింది. ద్వీతియార్ధంలో వల్స్కిస్ మరో గోల్తో ఆధిక్యాన్ని 2-0తో డబుల్ చేశాడు. కార్నర్ మన్ రాయ్ ఇచ్చిన పాస్ను.. 6 యార్డ్స్ దూరం నుంచి వల్స్కిస్ గోల్గా మల్చాడు. ఈ స్థితిలో పోరాడిన ఏటీకే 80వ నిమిషంలో రాయ్ కృష్ణ గోల్ చేయడంతో రేసులోకి దూసుకొచ్చింది. కానీ ఆ తర్వాత గోల్ రాకుండా జంషెడ్పూర్ జాగ్రత్త పడటంతో ఏటీకే ఓటమిపాలైంది.