
గోవా: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఏడో సీజన్లో మరో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. లీగ్ మ్యాచ్లో భాగంగా శనివారం రాత్రి జీఎంసీ స్టేడియం వేదికగా చెన్నయిన్ ఎఫ్సీ, గోవా ఎఫ్సీ మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. చెన్నై తరఫున జాకుబ్ సిల్వెస్టర్(13వ నిమిషం), చంగ్టి(60వ నిమిషం) గోల్స్ చేయగా.. ఇగోర్ అంగులో(19వ నిమిషం), ఇషాన్ పండిటా(90వ నిమిషం) గోవాకు గోల్స్ అందించారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గోవా ఫుట్బాల్ క్లబ్ కుడి నుంచి ఎడమకు ఆడటానికి నిర్ణయించుకున్నది. ఆట మొదలైన తొలి నిమిషంలోనే గోవా జట్టు గోల్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నది. 13వ నిమిషంలో చెన్నయిన్ ఆటగాడు జాకుబ్ సిల్వెస్టర్ గోల్ చేసి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. కాగా, 19వ నిమిషంలో చెన్నయిన్ చేసిన పొరపాటుకు గోవాకు పెనాల్టీ లభించింది. ఇగోర్ అంగులో ఎలాంటి తప్పిదం చేయకుండా పెనాల్టీని గోల్గా మలచి స్కోర్ 1-1కి సమం చేశాడు. అనంతరం ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ నమోదు కాకపోవడంతో ఫస్టాఫ్ 1-1తో ముగిసింది.
సెకండాఫ్ 60వ నిమిషంలో చెన్నయిన్ మిడ్ ఫీల్డర్ రీగన్ సింగ్ ఇచ్చిన పాస్ను లాలిన్జులా చాంగ్టే గోల్గా మార్చాడు. దీంతో చెన్నయిన్ 2-1 ఆధిక్యంలోకి దూసుకొని పోయింది. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత రిఫరీ ఇంజ్యూరీ సమయం మరో నాలుగు నిమిషాలు కలిపారు. ఆ సమయంలో గోవా ఆటగాడు అల్బెర్టో నొగురా ఇచ్చిన పాస్ను ఇషాన్ పండిత గోల్గా మలిచాడు. దీంతో స్కోర్లు 2-2తో సమంగా నిలిచి మ్యాచ్ డ్రాగా ముగిసింది. అల్బెర్టో నొగురాకు డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, ఇషాన్ పండితకు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. పాయింట్స్ టేబుల్లో గోవా ఎఫ్సీ మూడో స్థానంలో ఉండగా.. చెన్నయిన్ 8వ స్థానంలో కొనసాగుతోంది.