పనాజి: అద్భుత విజయంతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఏడో సీజన్ను ఆరంభించిన హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ మరో విజయాన్ని తృటిలో చేజార్చుకుంది. చివరి దశలో తడబడి వరుసగా రెండో మ్యాచ్లోనూ డ్రాతో సరిపెట్టుకుంది. బుధవారం ఇక్కడి తిలక్ మైదాన్ స్టేడియంలో జంషెడ్పూర్ ఎఫ్సీ-హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీగా సాగిన పోరు 1-1తో డ్రా ముగిసింది.
హైదరాబాద్ తరఫున 50వ నిమిషంలో అరిడానే శాంటానా గోల్ కొట్టగా.. జంషెడ్పూర్ ప్లేయర్ స్టీఫెన్యిజే 85వ నిమిషంలో గోల్ చేసి ఆ జట్టకు ఓటమి తప్పించాడు. అంతకుముందు ఫస్టాఫ్లో ఇరు జట్లూ ఖాతా తెరువలేకపోయాయి. అయితే బ్రేక్ నుంచి వచ్చిన వెంటనే పవన్ కుమార్ నుంచి పాస్ అందుకున్న శాంటానా బాల్ను నేరుగా నెట్లోకి పంపి హైదరాబాద్కు 1-0తో లీడ్ అందించాడు. కాసేపటికే లీడ్ను డబుల్ చేసి గోల్డెన్ చాన్స్ను ఆశీష్ రాయ్ వృథా చేశాడు.
ఈ సమయంలో జంషెడ్పూర్ గోల్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే, ఆ టీమ్ ప్లేయర్లను హైదరాబాద్ డిఫెండర్లు సమర్థవంతంగా నిలువరించారు. 71 నిమిషంలో ఆ టీమ్ గోల్ కొట్టినప్పటికీ ఫౌల్ కావడంతో రెఫరీ దాన్ని తిరస్కరించాడు. దాంతో హైదరాబాద్ విజయం దిశగా సాగింది. 80 వ నిమిషంలో గాయంతో శాంటానా గ్రౌండ్ వీడటంతో హైదరాబాద్ కాస్త డీలా పడింది.
కాసేపటికే ఇన్సైడ్ బాక్స్ నుంచి యిజే చేసిన గోల్తో జంషెడ్పూర్ గట్టెక్కింది.ఈ మ్యాచ్కు ముందు బెంగళూరు ఫుట్ క్లబ్తో జరిగిన మ్యాచ్ను హైదరాబాద్ డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 5 పాయింట్లతో టేబుల్లో 4వ స్థానంలో కొనసాగుతోంది.