
బాంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఏడో సీజన్లో బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ రెండో విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ నేతృత్వంలోని బెంగళూరు 4-2తో కేరళ బ్లాస్టర్స్ ఫుట్బాల్ క్లబ్పై నెగ్గింది. ఈ మ్యాచ్లో
ఆద్యంతం బంతిపై ఆధిపత్యం చూపెట్టిన బెంగళూరు ప్రత్యర్థిపై పంజా విసిరింది.
బెంగళూరు తరఫున క్లెటన్ సిల్వ(29వ నిమిషం), పార్తాల్ (51వ నిమిషం), దిమాస్ (53వ నిమిషం), చెత్రీ (65వ నిమిషం) గోల్స్ చేయగా, రాహుల్(17వ నిమిషం), ముర్రే(61వ నిమిషం) కేరళకు గోల్స్ అందించారు. ఆడిన ఐదు మ్యాచ్ల్లో రెండు విజయాలు, మూడు డ్రాలతో 9 పాయింట్లు సాధించిన బెంగళూరు టేబుల్లో నాలుగో స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్ ప్రారంభంలో ఫస్ట్ 15 నిమిషాల వరకు బాల్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో గోల్ చేసే అవకాశం రాలేదు. కానీ రెండు నిమిషాల తర్వాత కేరళ ఎదురు దాడి మొదలుపెట్టడంతో రాహుల్ ఫీల్డ్ గోల్ చేశాడు. కానీ 12 నిమిషాల వ్యవధిలోనే గురుప్రీత్ సింగ్ ఇచ్చిన లాంగ్ పాస్ను క్లెటన్ సిల్వా గోల్ పోస్ట్లోకి పంపి స్కోర్ను సమం చేశాడు. దీంతో ఫస్ట్ హాఫ్ 1-1తో ముగిసింది. సెకండ్ హాఫ్లో పూర్తి విభిన్నంగా ఆడిన బెంగళూరు వరుస దాడులతో ప్రత్యర్థి సర్కిల్లోకి దూసుకుపోయింది.
దీంతో మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టి లీడ్ను 3-1కి పెంచుకుంది. దీని నుంచి తొందరగానే తేరుకున్న కేరళ 61వ నిమిషంలో గోల్ చేసినా లీడ్ను సమం చేయలేక పోయింది. మరో నాలుగు నిమిషాల తర్వాత రైట్ ఫ్లాంక్ నుంచి హర్మన్ జ్యోత్ ఇచ్చిన పాస్ను కెప్టెన్ చెత్రీ హెడర్గా మలచి లీడ్ను 4-2కు పెంచాడు. ఆ తర్వాత స్కోర్ సమం చేసేందుకు కేరళ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.