
బంబొలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఏడో సీజన్లో మరో మ్యాచ్ గోల్ లేకుండానే ముగిసింది. లీగ్ దశలో భాగంగా మంగళవారం ఇక్కడి జీఎంసీ స్టేడియంలో ఏటీకే మోహన్బగాన్, చెన్నయిన్ ఫుట్బాల్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. మ్యాచ్ ఐదో నిమిషంలో చెన్నయిన్కు గోల్ అవకాశం దొరకగా.. ఏటీకే గోల్కీపర్ దాన్ని అద్భుతంగా అడ్డుకున్నారు.
మరోపక్క ఏటీకే స్టార్ ప్లేయర్ రాయ్కృష్ణను కట్టడి చేయడంలో చెన్నయిన్ డిఫెండర్లు సక్సెస్ అయ్యారు. దీంతో ఫస్టాఫ్లో ఎవ్వరికి లీడ్ దొరకలేదు. సెకండాఫ్ ప్రారంభం నుంచి ఇరు జట్ల స్ట్రయికర్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్పై పోటాపోటీగా దాడులు చేశారు. కానీ చివరిదాకా ఫలితం రాబట్టలేకపోయారు. కాగా, ఇప్పటిదాకా ఎనిమిది మ్యాచ్లాడిన ఏటీకే ఐదు విజయాలు, రెండు డ్రాలు, ఒక ఓటమితో 17 పాయింట్ల సాధించడంతోపాటు టేబుల్ టాపర్గా నిలిచింది. 8 మ్యాచ్ల్లో రెండు విజయాలు, నాలుగు డ్రాలు, రెండు ఓటములతో 10 పాయింట్లు సాధించిన చెన్నయిన్ ఎఫ్సీ ఏడో ప్లేస్లో కొనసాగుతోంది.