
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఏడో సీజన్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్ జోరుకు బ్రేక్ పడింది. సోమవారం జరిగిన మ్యాచ్లో జంషెడ్పూర్ 1-1తో టేబుల్ టాపర్ ముంబైని నిలువరించింది. డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్లో తొలి 15 నిమిషాల్లోనే రెండు గోల్స్ వచ్చాయి.
9వ నిమిషంలోనే జంషెడ్పూర్ ఖాతా తెరిచి ప్రత్యర్థికి షాకిచ్చింది. జాకీచంద్ సింగ్ సహకారంతో ఆ టీమ్ ప్లేయర్ నెరిజస్ వాల్కిస్ గోల్ కొట్టాడు. అయితే 6 నిమిషాల తర్వాత ముంబై ఆటగాడు బర్తొలొమెవ్ గోల్ కొట్టి స్కోర్ సమం చేశాడు.
అయితే 28వ నిమిషంలో రెడ్ కార్డ్ ఎదుర్కొన్న జంషెడ్పూర్ ప్లేయర్ ఐటర్ మన్రోయ్ గ్రౌండ్ వీడడంతో ఆ జట్టు పది మందితోనే ఆటను కొనసాగించింది. అయినా ముంబై జట్టు మరో గోల్ చేయకుండా అడ్డుకోవడంలో ఆ టీమ్ సక్సెస్ అయింది.
జంషెడ్ పూర్ డిఫెండర్లు మైదానంలో సమతూకంగా కదులుతూ ముంబైని ముప్పు తిప్పలు పెట్టారు. పదే పదే తమ గోల్ పోస్ట్లోకి దూసుకొచ్చినా చాకచక్యంగా అడ్డుకున్నారు. దాంతో ముంబై మరో గోల్ చేయలేకపోయింది.