వాస్కో: ఇండియన్ సూపర్ లీగ్ ఏడో సీజన్లో మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఎఫ్సీ గోవా, కేరళ బ్లాస్టర్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్ 1-1తో ఫలితం తేలకుండా డ్రా అయింది. గోవా ఎఫ్సీ తరఫున జార్జ్ మెన్డోజ్(25వ నిమిషం) గోల్ సాధించాడు. కేపీ రాహుల్(57వ నిమిషం) కేరళకు గోల్ అందించాడు.
ఇక ఆటప్రారంభమైన 25వ నిమిషంలో సహచరుడి నుంచి పాస్ అందుకున్న జార్జ్ మెన్డోజ్ బంతిని గోల్ పోస్ట్లోకి కొట్టి గోవాను 1-0తో లీడ్లో నిలిపాడు. ఆ తర్వాత ఇరు జట్లు ప్రయత్నించినా మరో గోల్ నమోదు కాలేదు. దాంతో ఫస్టాఫ్ 1-0తోనే ముగిసింది. సెకాండాఫ్లో దూకుడు పెంచిన కేరళ బ్లాస్టర్స్.. 57వ నిమిషంలోనే కేపీ రాహుల్ సాయంతో ఖాతా తెరిచి 1-1తో లెక్క సరిచేసింది.
ఇక 65వ నిమిషంలో రెఫరీ నుంచి రెండో హెచ్చరికలు అందుకున్న గోవా ప్లేయర్ ఇవాన్ రెడ్ కార్డ్(రెండో ఎల్లో కార్డ్) తో గ్రౌండ్ను వీడాడు. దీంతో గోవా మిగిలిన ఆటను పది మందితోనే పూర్తి చేసింది. ఇరు జట్లు గట్టిగా ప్రయత్నించినా మరో గోల్ రాలేదు. కేరళ ఆదిపత్యాన్ని గోవా సమర్థవంతంగా ఎదుర్కొంది. దాంతో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది.
ఇప్పటిదాకా 13 మ్యాచ్లాడిన గోవాకు ఇది ఐదో డ్రా. అదే సంఖ్యలో మ్యాచ్లాడిన కేరళ కూడా ఐదింటినే డ్రా చేసుకుంది. పాయింట్ల పట్టికలో 5 విజయాలతో గోవా మూడో స్థానంలో కొనసాగుతుండగా.. 3 విజయాలతో కేరళ ఏడో స్థానంలో ఉంది. 9 విజయాలతో ముంబై అగ్రస్థానంలో ఉండగా.. 7 విజయాలతో ఏటీకే రెండో స్థానంలో ఉంది.