హైదరాబాద్: భారత ఫుట్బాల్ దిగ్గజం, 70వ దశకంలో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగిన హైదరాబాద్కు చెందిన మహ్మద్ హబీబ్ (74) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా ఆయన డిమెన్షియా, పార్కిన్సన్స్ సిండ్రోమ్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
1949 జులై 1న హైదరాబాద్లో జన్మించిన మహ్మద్ హబీబ్ తన స్వస్థలంలోనే తుదిశ్వాస విడిచారు. 1965-76 మధ్య అనేక టోర్నీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. 1970లో బ్యాంకాక్ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో మరో హైదరాబాదీ ప్లేయర్ సయ్యద్ నయీముద్దీన్ కెప్టెన్సీలో ఆడిన హబీబ్.. బ్రాంజ్ మెడల్ అందుకున్నారు.

భారత ఫుట్బాల్ జట్టుకు కోచ్గా కూడా ఆయన సేవలందించారు. మిడ్ఫీల్డర్గా మూడు ప్రఖ్యాత మోహన్బగాన్, ఈస్ట్ బెంగాల్, మొహమ్మద్ దాన్ స్పోర్టింగ్ క్లబ్స్కు ఆయన ప్రాతినిథ్యం వహించారు. 1977లో కోల్కతా వేదికగా జరిగిన ఓ మ్యాచ్లో హబీబ్ ఆటకు ముగ్దుడైన ఫుట్బాల్ దిగ్గజం పీలే ప్రత్యేకంగా అభినందించారు.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ ఫ్రెండ్లీ మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మోహన్బగాన్ క్లబ్ తరఫున హబీబ్ బరిలోకి దిగగా.. కాస్మోస్ క్లబ్లో ఆల్టైమ్ గ్రేట్ ప్లేయర్స్ పీలే, కార్లోస్ ఆడారు. ఈ మ్యాచ్ 2-2తో ఫలితం తేలకుండా ముగియగా.. హబీబ్ ఓ గోల్ చేశారు. ప్రతిష్టాత్మక డ్యురాండ్ కప్లో మూడు వేర్వేరు ఫైనల్లో గోల్ చేసిన ఏకైక ఆటగాడిగా హబీబ్ చరిత్రకెక్కారు.
1966లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంతోష్ ట్రోఫీ గెలవడంలో హబీబ్ కీలక పాత్ర పోషించారు. ఫైనల్లో బెంగాల్ను ఓడించి చిరస్మరణీయ విజయాన్నందించారు. 1965 నుంచి 1975 వరకు పదేళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన హాబీబ్ను 1980లో భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది.
ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం కోచ్గా పనిచేశారు. హబీబ్ మరణం పట్ల భారత ఫుట్బాల్ లోకం దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది.