దోహా: భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు . దిగ్గజ ఫుట్బాలర్, అర్జెంటీనా సూపర్స్టార్ లియోనల్ మెస్సీని వెనక్కి నెట్టాడు. ప్రస్తుతం ఆడుతున్న వారిలో 74 గోల్స్తో అత్యధిక గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. పోర్చుగల్కు చెందిన క్రిస్టియానో రొనాల్డొ (103) తర్వాతి స్థానంలో నిలిచాడు.
ఫిఫా ప్రపంచకప్ 2022, ఏఎఫ్సీ ఆసియా కప్ 2023కు సంయుక్తంగా బంగ్లాదేశ్తో జరిగిన ప్రిలిమినరీ క్వాలిఫయింగ్ మ్యాచ్లో భారత్ ఫుట్బాల్ జట్టు 2-0తో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఆఖర్లో ఛెత్రీ గోల్ కొట్టి ప్రపంచకప్ అర్హత పోటీల్లో ఆరేళ్ల తర్వాత టీమిండియాకు తొలి విజయం అందించాడు. 79వ నిమిషంలో ఎడమవైపు నుంచి ఆషిక్ కురునియన్ ఇచ్చిన క్రాస్ను దూరం నుంచి అతను గోల్గా మలిచాడు.
గోల్స్ పరంగా మెస్సీ కన్నా రెండు, అలీ మబ్కౌత్ (73) కన్నా ఒక స్థానం ముందంజలో ఛెత్రీ నిలిచాడు. గత గురువారం చిలీతో జరిగిన ప్రపంచకప్ అర్హత మ్యాచ్లో మెస్సీ 72వ గోల్ చేశాడు. మలేసియాతో మ్యాచులో మబ్కౌత్ 73వ గోల్ చేయడం గమనార్హం.
ఇక ఆల్టైమ్ టాప్-10లో ప్రవేశించేందుకు ఛెత్రీ కేవలం ఒకేఒక్క గోల్ దూరంలో ఉన్నాడు. శాండర్ కోసిస్ (హంగేరి), కునిషిగె కుమమోటో (జపాన్), బషర్ అబ్దుల్లా (కువైట్ ) 75 గోల్స్తో అతడి కన్నా ముందున్నారు. 74వ గోల్ సాధించిన ఛెత్రీని భారత ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ ప్రశంసించారు. టాప్ లిస్ట్లో చేరిన ఛెత్రికి ఇండియన్ సోషల్ మీడియా సలాం చెబుతోంది. ఇక ఈ రికార్డు ఫీట్ను 36 ఏళ్ల ఛెత్రి కూడా చాలా తేలికగా తీసుకోవడం విశేషం.