హైదరాబాద్లో అంతర్జాతీయ ఫుట్బాల్ సందడి నెలకొంది. గచ్చిబౌలి స్టేడియంలో సోమవారం జరిగే ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్లో మలేసియాతో భారత్ ఫుట్బాల్ జట్టు తలపడనుంది. రాత్రి 7.30కి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్కు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఇప్పటికే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఈ మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ వేదికగా ఫిఫా ఫ్రెండ్లీ టోర్నమెంట్ జరగడం ఇదే తొలిసారి.

ఇక ఈ ఏడాది 10 మ్యాచ్లు ఆడిన భారత ఫుట్బాల్ జట్టు.. ఒక్క దాంట్లోనూ విజయం సాధించలేదు. గాయం కారణంగా పది నెలలపాటు ఆటకు దూరమైన సీనియర్ ఆటగాడు సందేశ్ జింగన్.. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్తో జట్టులోకి పునరాగమనం చేస్తున్నాడు.
అతని రీఎంట్రీ జట్టు బలాన్ని పెంచనుంది. భారత్-మలేసియా ముఖాముఖి పోరులో ఇరుజట్లూ 32 సార్లు తలపడగా.. చెరో 12 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. సొంతగడ్డపై బరిలోకి దిగుతుండటం భారత ఫుట్బాల్ టీమ్కు కలిసొచ్చే విషయం.
భారత దిగ్గజ ఫుట్బాలర్ సునీల్ ఛెత్రీ తప్పుకున్న తర్వాత జట్టు ఆట గాడితప్పింది. దేశంలో ఫుట్బాల్ సరైన ఆదరణ లేకపోవడంతో ఈ ఆటలోకి కొత్తగా కుర్రాళ్లు రావడం లేదు. అందరూ క్రికెట్కే ప్రాధాన్యత ఇస్తుండటంతో భారత్లో ఇతర క్రీడల పరిస్థితి దయనీయంగా మారింది.
మరోవైపు నగరంలో ఫుట్బాల్ ఆదరణ పెంచడంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఫుట్బాల్ ఆడటాన్ని ఇష్టపడే రేవంత్ రెడ్డి.. ఈ ఆటకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఖాళీ సమయంలో ఫుట్బాల్ ఆడుతూ.. కుర్రాళ్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఫిఫా ఫ్రెండ్లీ టోర్నీకి జియోసినిమా అధికారిక బ్రాడ్కాస్టర్గా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ వేదికగా జరిగే నేటీ మ్యాచ్ జియోసినిమాతో పాటు స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. జియోసినిమాలో ఫ్రీగా ఈ మ్యాచ్ను వీక్షించవచ్చు. స్పోర్ట్స్ 18 ఛానెల్ను మాత్రం సబ్స్ట్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.