భారత ఫుట్బాల్ ప్రేమికులు ఎదురు చూస్తోన్న సమయం ఆసన్నమైంది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనకు వచ్చాడు. 'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'పేరుతో సాగనున్న ఈ పర్యటనలో భాగంగా అతను శనివారం తెల్లవారుజామున కోల్కతాలో అడుగుపెట్టాడు. మెస్సీ రాకతో కోల్కతా అంతా ఇప్పుడు అతని జపమే చేస్తోంది. 2011 తర్వాత మెస్సీ భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. కానీ అప్పటిలా ఫుట్బాల్ మ్యాచ్ కోసం కాకుండా.. ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం భారత్లో అడుగుపెట్టాడు. శనివారం ప్రారంభమైన మెస్సీ పర్యటన సోమవారం ముగుస్తుంది.
మూడు రోజుల పాటు భారత్లో ఉండనున్న మెస్సీ.. కోల్కతాతో పాటు హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలో పర్యటించనున్నాడు. మెస్సీతో పాటు అతని ఇంటర్ మియామీ జట్టు సహచర ఆటగాళ్లు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్ వస్తున్నారు. ఈ టూర్లో మెస్సీ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రులు, కార్పొరేట్ దిగ్గజాలు, బాలీవుడ్ సెలెబ్రిటీలను కలవనున్నాడు.
శనివారం కోల్కతాలో తన పర్యటన ముగియగానే మెస్సీ హైదరాబాద్కు రానున్నాడు. ఫలక్నుమా ప్యాలెస్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటాడు. ఆ తర్వాత గోట్ కప్ పేరుతో ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతాడు. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆడతారు. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం రేవంత్ రెడ్డి గత రెండు-మూడు వారాలు ప్రాక్టీస్ కూడా చేశాడు.

ఇప్పటికే ఈ మ్యాచ్పై రాష్ట్రవ్యాప్తంగా హైప్ క్రియేట్ అయ్యింది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల జట్టుకు రేవంత్ రెడ్డి సారథ్యం వహించనున్నాడు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ డీడీ స్పోర్ట్స్తో పాటు సోనీ లైవ్ ఓటీటీ యాప్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్తో పాటు మెస్సీ పూర్తి పర్యటనను ఈ రెండు వేదికల్లో ప్రసారం చేయనున్నారు. డీడీ స్పోర్ట్స్లో ఉచితంగా మెస్సీ పర్యటనను చూడవచ్చు. కానీ సోనీ లైవ్ యాప్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జియో ప్రత్యేకమైన రిఛార్జ్ ప్లాన్తో సోనీ లివ్ యాప్ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా పొందవచ్చు.
తెల్లవారుజాము 1:30 గంటలు: కోల్కతాకు చేరుకుంటారు.
ఉదయం 9:30 నుంచి 10:30 గంటల వరకు: మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమం.
ఉదయం 10:30 నుంచి 11:15 గంటల వరకు: మెస్సీ విగ్రహాన్ని వర్చువల్గా ఆవిష్కరణ.
ఉదయం 11:15 నుంచి 11:25 గంటల వరకు: యువభారతి స్టేడియానికి చేరుకుంటారు.
ఉదయం 11:30 గంటలు: షారుక్ ఖాన్ యువభారతి స్టేడియానికి చేరుకుంటారు.
మధ్యాహ్నం 12:00 గంటలు: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,సౌరవ్ గంగూలీ వివేకానంద యువభారతి క్రీడాంగణం (సాల్ట్ లేక్ స్టేడియం)కు చేరుకుంటారు.
మధ్యాహ్నం 12:00 నుంచి 12:30 గంటల వరకు: స్నేహపూర్వక మ్యాచ్, సన్మానం, సంభాషణ.
మధ్యాహ్నం 2:00 గంటలు: హైదరాబాద్కు బయలుదేరుతారు.
సాయంత్రం 7:00 గంటలు: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో 7v7 మ్యాచ్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీమ్తో లియోనెల్ మెస్సీ ఆడుతాడు. ఆ తర్వాత సంగీత కచేరీ.
మధ్యాహ్నం 3:30 గంటలు: క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో (CCI) పాడెల్ కప్లో పాల్గొనడం.
సాయంత్రం 4:00 గంటలు: సెలబ్రిటీల ఫుట్బాల్ మ్యాచ్.
సాయంత్రం 5:00 గంటలు: వాంఖడే స్టేడియంలో ఈవెంట్, ఆ తర్వాత ఛారిటీ ఫ్యాషన్ షో.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం.
మధ్యాహ్నం 1:30 గంటలు: అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈవెంట్, ఇందులో మినర్వా అకాడమీ ఆటగాళ్లకు సన్మానం ఉంటుంది.