హైదరాబాద్: నగరానికి చెందిన అంతర్జాతీయ మాజీ ఫుట్బాలర్, ధ్యాన్చంద్ అవార్డు గ్రహీత సయ్యద్ షాహిద్ హకీమ్ (81) కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన నగరంలోని ఒక హోటల్లో ప్రభుత్వ పర్యవేక్షణలో క్వారంటైన్లో ఉన్నారు. ఇటీవల కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్లొచ్చిన హకీమ్.. ఆ తర్వాత నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. వారం క్రితం కొవిడ్ పరీక్ష చేయించుకోగా, పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది. 'రెండ్రోజుల నుంచి నా ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకొని మీ ముందుకొస్తా' అని హకీమ్ తెలిపాడు. హకీమ్.. 1960 రోమ్ ఒలింపిక్స్లో పాల్గొన్న భారత ఫుట్బాల్ జట్టులో సభ్యుడు.
గతంలో ఎయిర్ఫోర్స్లో పని చేసిన ఆయన ముందుగా మిలిటరీ ఆస్పత్రిలో చేరేందుకు ప్రయత్నించగా పడకలు అందుబాటులో లేవని తెలిసింది. ప్రభుత్వ ఆస్పత్రిలలో సౌకర్యాలపై సందేహంతో చివరకు హోటల్లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. భారత దిగ్గజ ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ (ఎస్ఏ) రహీమ్ కుమారుడైన హకీమ్ రిటైర్మెంట్ అనంతరం కోచ్గా, రిఫరీగా కూడా పని చేశారు. ఫుట్బాల్కు హకీమ్ అందించిన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 2017లో ధ్యాన్చంద్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ పురస్కారంతో గౌరవించింది.
మిథాలీ రాజ్ వేటు వెనుక చాలా పెద్దోళ్లున్నారు: హర్మన్ప్రీత్ కౌర్