అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ భారత పర్యటనను ఉద్దేశించి ఫుట్బాల్ కోచ్ రంజిత్ బజాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. లియోనల్ మెస్సీని భారత్కు తీసుకొచ్చేందుకు రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఆ డబ్బులను తనకిస్తే 10 మంది మెస్సీలను తయారు చేస్తానని రంజిత్ బజాజ్ ఓ పాత ఇంటర్వ్యూలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మెస్సీ భారత పర్యటన ఖరారైన నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రంజిత్ బజాజ్ ఈ కామెంట్స్ చేశాడు.
'లియోనల్ మెస్సీని భారత్లోని కేరళకు తీసుకొచ్చేందుకు రూ. 150 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ రూ.150 కోట్లు నాకివ్వండి. సాకర్ ప్రపంచ కప్ గెలవడానికి కావాల్సిన పది మంది భారత మెస్సీలను నేను తయారు చేస్తాను.'అని పేర్కొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో భారత్లో ఫుట్బాల్ ఎదగకపోవడానికి గల కారణాలను కూడా చెప్పాడు. తాజాగా మెస్సీ భారత పర్యటనకు రావడంతో అతని వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా లియోనల్ మెస్సీ కోల్కతా, హైదరాబాద్, ముంబైతో పాటు న్యూఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటన కోసం నిర్వాహకులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేస్తున్నాయని, వందల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రంజిత్ బజాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రంజిత్ బజాజ్ చేసిన వ్యాఖ్యలతో మెజార్టీ నెటిజన్లు ఏకీ భవిస్తున్నారు.
మెస్సీ పర్యటన నేపథ్యంలో తాజాగా ఏఎన్ఐతో మాట్లాడిన రంజిత్ బజాజ్.. అతన్ని కలిసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నామని తెలిపాడు. 'మేమంతా లియోనెల్ మెస్సీని కలవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాము. అతన్ని కలిస్తే నా
కల నెరవేరినట్లే... పిల్లలు తమ ఆరాధ్యదైవం లియోనెల్ మెస్సీని కలవడం కంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. హైదరాబాద్, ముంబైలలో జరిగిన ఈవెంట్లను చాలా బాగా నిర్వహించారు. మెస్సీని చూడటానికి రాజకీయ నాయకులే కాకుండా జనాలు వచ్చారు
ఫుట్బాల్కు ప్రభుత్వం అండగా ఉంటే.. ప్రజల నుంచి వారికి మద్దతు లభిస్తుంది. భారత్లో ఒక మెస్సీ పుట్టుకొస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. విదేశీ మెస్సీకి ఇంత ప్రేమ, అభిమానం లభిస్తే.. భారత మెస్సీని ఎంతలా ఆరాధిస్తారు.? భారత క్రికెటర్లు ధోనీ, కోహ్లీ, సచిన్తో పాటు నీరజ్ చోప్రా, అభినవ్ బింద్రా వంటి ప్లేయర్లు వరల్డ్ క్లాస్ అథ్లెట్స్గా ఎదిగినప్పుడు.. ఇతర క్రీడల్లో నుంచి అత్యుత్తమ ఆటగాళ్లు ఎందుకు రారు? ఇండియన్ మెస్సీ ఎందుకు కాలేరు'అని రంజిత్ బజాజ్ ప్రశ్నించాడు.