
దోహా: ఒలింపిక్స్ తర్వాత ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన సాకర్ వరల్డ్ కప్ ప్రారంభోత్సవం ఆదివారం రాత్రి అంగరంగవైభవంగా జరిగింది. ఖతార్ సంస్కృతి సంప్రదాయలను ప్రతిబింబిస్తూ, గత ప్రపంచ కప్లను అవలోకిస్తూ, ఆధునిక తరాన్ని ఆకట్టుకొనేలా సాగిన కార్యక్రమాలు 60వేల మందితో కిక్కిరిసిన అల్ బయత్ స్టేడియాన్ని ఉర్రూతలూగించాయి. ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ మధ్య జరిగిన తొలి మ్యాచ్తో ఫుట్బాల్ ప్రపంచకప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ ఆరంభ మ్యాచ్లో ఈక్వెడార్ 2-0తో ఆతిథ్య ఖతార్ను ఓడించింది.
ఇక రెండో రోజు ఇంగ్లండ్తో ఇరాన్ తలపడగా.. ఆట ఆరంభానికి ముందు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సంప్రదాయం ప్రకారం మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరు జట్లు తమ జాతీయ గీతాన్ని ఆలపించాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ తమ జాతీయ గీతాన్ని పాడగా.. ఇరాన్ జట్టు మాత్రం జాతీయ గీతం పాడకుండా నిరసన తెలియజేసింది. తమ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా ఇరాన్ ఫుట్బాల్ ఆటగాళ్లు జాతీయ గీతం ఆలపించకుండా అంతర్జాతీయ వేదికగా తమ నిరసనను తెలియజేశారు.
హిజాబ్కు వ్యతిరేకంగా ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులకు మద్దతుగా, ఇరాన్ ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ఆ దేశ ఆటగాళ్లు ఫిఫా ప్రపంచ కప్ లో ఆడుతున్న తొలి మ్యాచులో జాతీయ గీతాన్ని ఆలపించలేదు. కొన్ని వారాల క్రితం హిజాబ్ సరిగ్గా ధరించలేదంటూ మహ్సా అమిని అనే యువతి పోలీసులు అరెస్ట్ చేయగా..ఆమె కస్టడీలో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. దాంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.
ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులకు మద్దతుగా, ఇరాన్ ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ఆ దేశ ఆటగాళ్లు ఫిఫా ప్రపంచ కప్ లో ఆడుతున్న తొలి మ్యాచులో జాతీయ గీతాన్ని ఆలపించలేదు. ఆట జరుగుతున్న ఖలీఫా అంతర్జాతీయ మైదానంలో ఇరాన్ జాతీయ గీతాన్ని ప్లే చేసిన సమయంలో ఆ దేశానికి చెందిన 11 మంది ఆటగాళ్లూ మౌనంగా ఉండిపోయారు. తమ జట్టు సభ్యులం అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని ఇరాన్ కెప్టెన్ అలీ రెజా జహంబఖష్ చెప్పాడు. ఈ మ్యాచ్లో ఇరాన్ ఓటమి దిశగా దూసుకెళ్తోంది. ఇంగ్లండ్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించడంతో ఇరాన్ 1-5తో వెనుకంజలో నిలిచింది.