దోహా: ఫిఫా ప్రపంచకప్ 2022లో జపాన్ శుభారంభం చేసింది. గ్రూప్-ఈలో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో జపాన్ 2-1 తేడాతో జర్మనీని ఓడించింది. జర్మనీ తరఫున ఇకాయ్(33వ నిమిషం) ఏకైక గోల్ చేయగా.. జపాన్ తరఫున రిట్సూ డోన్(75వ నిమిషం), టకుమ్ అసానో(83వ నిమిషం) గోల్స్ కొట్టారు. గ్రూప్-ఈ ఫేవరేట్ అయిన జర్మనీకి జపాన్ షాకిచ్చింది. 17వ ర్యాంకర్ జపాన్.. 12వ ర్యాంకర్ జర్మనీని ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు పోటా పోటీగా తలపడ్డాయి.
ఫస్టాఫ్లో ఆధిపత్యం చెలాయించిన జర్మనీ 33వ నిమిషంలో ఇకాయ్ గోల్తో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. సెకండాఫ్లో కూడా జర్మనీ జోరు కనబర్చినా.. జపాన్ డిఫెండర్లు అడ్డుకున్నారు. ఆట చివరి దశకు చేరుతుండగా.. రిట్సూ డోన్ 75వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి 1-1తో సమం చేశాడు. ఆ వెంటనే టకుమ్ అసానో మరో గోల్ కొట్టడంతో జపాన్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం జర్మనీ ఎంత ప్రయత్నించినా.. జపాన్ అవకాశం ఇవ్వలేదు. చివరి వరకు లీడ్ కాపాడుకొని విజయాన్నందుకుంది.
గ్రూప్-ఎఫ్లో భాగంగా మొరాకో, క్రొయేషియా మధ్య జరిగిన మ్యాచ్ పేలవ డ్రాగా ముగిసింది. 2018 ఫిఫా వరల్డ్కప్లో రన్నరప్గా నిలిచిన క్రొయేషియా జట్టు ఈ మ్యాచ్లో పెద్దగా మెరవలేదు. క్రొయేషియా పలుసార్లు గోల్పోస్ట్పై దాడి చేసినప్పటికి మొరాకో డిఫెన్స్ పటిష్టంగా ఉండడంతో గోల్స్ కొట్టలేకపోయింది. తొలి హాఫ్ టైమ్లో ఇరుజట్లు గోల్స్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాయి. ఇక రెండో హాఫ్ టైంలోనూ అదే పరిస్థితి. అదనపు సమయంలోనే ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో చెరొక పాయింట్ కేటాయించారు. ఇక తమ తర్వాతి మ్యాచ్లో క్రొయేషియా..కెనడాతో ఆడనుండగా; మొరాకో బెల్జియంతో అమితుమీ తేల్చుకోనుంది.