దోహా: ఫిఫా వరల్డ్కప్లో భాగంగా స్విట్జర్లాండ్తో జరిగిన కీలక ప్రీక్వార్టర్ మ్యాచ్లో పోర్చుగల్ తమ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో లేకుండా బరిలోకి దిగడం చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్లో పోర్చుగల్ అద్భుత విజయాన్నందుకొని క్వార్టర్స్ చేరినా.. రొనాల్డోను ఎందుకు ఆడించలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. టీమ్మేనేజ్మెంట్తో రొనాల్డోకు విభేధాలున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తనను పక్కనపెట్టాడాన్ని అవమానంగా భావించిన క్రిస్టియానో రొనాల్డో టీమ్ ప్రాక్టీస్కు డుమ్మా కొట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
తనను పక్కనపెట్టిన టీమ్తో కలిసి ప్రాక్టీస్ చేయడానికి రొనాల్డో ఇష్టపడటంలేదని.. కోచ్పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడని, రోజు మొత్తం జిమ్లో గడపడానికే ప్రాధాన్యం ఇచ్చాడని స్పెయిన్కు చెందిన ఓ దినపత్రిక తన కథనంలో వెల్లడించింది. అయితే ఈ వార్తలను జట్టు మేనేజర్ ఫెర్నాండో సాంటోస్ ఖండించాడు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు. రొనాల్డోను పక్కనపెట్టడంపై కూడా వివరణ ఇచ్చాడు.
'రొనాల్డోతో విబేధాలున్నాయన్న మాట వాస్తవం కాదు. అతను ఒక స్టార్ ప్లేయర్. రొనాల్డో లేకుండా జట్టు బలాలు, బలహీనతలు తెలుసుకోవాలనే అతన్ని పక్కనపెట్టాం. రొనాల్డో స్థానంలో జట్టులోకి వచ్చిన గొంకాలో రమోస్ అద్భుతంగా రాణించాడు. అలా.. అని రొనాల్డోను పక్కనబెట్టలేం. కానీ మొరాకోతో జరగనున్న క్వార్టర్స్లోనూ రొనాల్డో ఆడకపోవచ్చు. కొత్త వాళ్లకు అవకాశాలు రావాలి. మేం సరైన స్ట్రాటజీతోనే బరిలోకి దిగుతున్నాం'అని చెప్పుకొచ్చాడు..
మంగళవారం జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్లో పోర్చుగల్ 6-1 తేడాతో స్విట్జర్లాండ్ను చిత్తు చేసింది. రొనాల్డో స్ధానంలో తుది జట్టులోకి వచ్చిన రామోస్ హ్యాట్రిక్ గోల్స్తో విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్ మధ్యలో రొనాల్డో.. రొనాల్డో అంటూ అభిమానులు గట్టిగా అరవగా.. 73వ నిమిషంలో సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగాడు. జావో ఫెలిక్స్ స్థానంలో వచ్చిన రొనాల్డో గోల్ కొట్టడంలో మాత్రం విఫలమయ్యాడు.