|
8 ఏళ్ల తర్వాతే..
2003లో వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమితో నిరాశ చెందిన మాస్టర్ బ్లాస్టర్.. ఎనిమిదేళ్ల తర్వాత 2011లో ప్రపంచకప్ను అందుకున్నాడు. 2014లో ఫైనల్లో రన్నరప్తో సరిపెట్టుకున్న మెస్సీ.. ఎనిమిదేళ్లకు ఇప్పుడు కప్పును సొంతం చేసుకున్నాడు. 2011 ప్రపంచకప్ సెమీస్లో సచిన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకుంటే.. 2022 ప్రపంచకప్లోనూ మెస్సీ సెమీస్లో 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలవడం విశేషం. వేర్వేరు క్రీడల్లో అత్యుత్తమ ఆటగాళ్లుగా పేరున్న ఇద్దరి మధ్య ఇలాంటి పోలికలుండడం విశేషమే.
|
అప్పుడు సచిన్.. ఇప్పుడు మెస్సీ..
వన్డే ప్రపంచకప్ కోసం సచిన్ సుదీర్ఘ నిరీక్షణ కొనసాగుతున్న వేళ.. 2011లో అతను దాన్ని అందుకుని నిష్క్రమించాలని మెజారిటీ క్రికెట్ ప్రపంచం కోరుకుంది. ఇప్పుడు ఫుట్బాల్ ప్రపంచకప్లో అర్జెంటీనా టైటిల్కు అడుగు దూరంలో నిలిచిన వేళ.. ఒక్క ఫ్రాన్స్ అభిమానులు తప్ప అందరూ మెస్సీ జట్టుకే కప్పు సొంతం కావాలని కోరుకున్నారు. సచిన్, మెస్సీ ప్రపంచకప్ ప్రయాణం ఒకేలా ఉండటంపై భారత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న పోలికలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు షేర్ చేస్తున్నారు.
థ్రిల్లింగ్ విక్టరీ
ఆదివారం జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా 4-2తో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ను ఓడించింది. నిర్ణీత సమయం, అదనపు సమయం కలిపి ఇరు జట్లు 3-3తో సమంగా నిలవగా.. షూటౌట్తో ఫలితం తేల్చారు. అర్జెంటీనా తరఫున కెప్టెన్ లియోనల్ మెస్సీ(23వ నిమిషం, 108వ నిమిషం) రెండు గోల్స్ చేయగా.. మరియా(36వ నిమిషం) ఓ గోల్ కొట్టాడు. ఫ్రాన్స్ తరఫున ఎంబాపే ఒక్కడే(80వ నిమిషం, 81వ నిమిషం, 118వ నిమిషం) హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. కానీ షూటౌట్లో అర్జెంటీనా కీపర్ అడ్డుగోడలా నిలబడటంతో ఆ జట్టు విజయం లాంఛనమైంది.
ఒకే ఒక్కడు..
ఫిఫా ప్రపంచకప్ టైటిల్ లోటును తీర్చుకున్న మెస్సీ.. కెరీర్లో అన్ని ఘనతలను సాధించిన ప్లేయర్గా గుర్తింపు పొందాడు. ప్రపంచకప్ టోర్నీల్లో రెండుసార్లు గోల్డెన్ బాల్ అవార్డు అందుకొన్న ఏకైక ఆటగాడు మెస్సీనే. ఏడు సార్లు బాలెన్ డి ఓర్ అవార్డు అందుకొన్న మెస్సీఅండర్ -20 ప్రపంచకప్, ఒలింపిక్ గోల్డ్, కోపా అమెరికా, ఫిఫా ప్రపంచకప్ టైటిళ్లు కూడా సాధించాడు.