ముందే ఊహించాం..
కాగా ‘ఫిఫా' నిర్ణయాన్ని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) స్వాగతించింది. ఈ నిర్ణయం తాము ముందుగా ఊహించిందేనని సమాఖ్య కార్యదర్శి కుశాల్ దాస్ పేర్కొన్నారు. ‘కరోనా కారణంగా మిగతా టోర్నీల్లాగే ఇది కూడా వాయిదా పడుతుందని ముందే ఊహించాం.ఫిఫా నిర్ణయాన్ని మేం కచ్చితంగా ఆమోదించాల్సిందే. ప్రజారోగ్యం, ఆటగాళ్ల భద్రత, అభిమానుల క్షేమం కోరి ఫిఫా ఈ నిర్ణయం తీసుకొని ఉంటుంది. ఈ టోర్నీకి సంబంధించిన క్వాలిఫయింగ్ ఈవెంట్లు కూడా ఇంకా జరగాల్సి ఉన్నాయి. దీన్ని బట్టి ఈ టోర్నీ వచ్చే ఏడాది ఉంటుందని అనుకుంటున్నా' అని ఆయన తెలిపారు.
ఆతిథ్య హోదాలో..
మొత్తం 16 జట్లు తలపడే ఈ టోర్నీలో... ఆతిథ్య జట్టు హోదాలో భారత్ నేరుగా అర్హత పొందింది. అండర్-17 మహిళల ప్రపంచకప్లో పాల్గొనడం భారత్కిదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు అండర్-17 వరల్డ్కప్తో పాటు, ఆగస్టు-సెప్టెంబర్లో కోస్టారికా వేదికగా జరగాల్సిన అండర్-20 మహిళల ప్రపంచకప్నూ వాయిదావేయాలని వర్కింగ్ కమిటీ సూచించింది.
మెన్స్ ఏజ్ లిమిట్ పెంచిన ఫిఫా
కరోనా మహమ్మారి దెబ్బకు టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో మెన్స్ ఫుట్బాల్ ప్లేయర్ల వయస్సుకు సంబంధించి ఫిఫా సవరణలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం 1997 జనవరి 1వ తేదీ లేదా ఆ తర్వాత పుట్టినవారు కూడా ఒలింపిక్స్ ఆడేందుకు అర్హులు. దీని ప్రకారం ప్రస్తుతం అండర్-23 టోర్నీలు ఆడుతున్న వారు కూడా వచ్చే ఒలింపిక్స్ బరిలో దిగొచ్చు.