
న్యూఢిల్లీ: మెక్సికో ఫుట్బాల్ లీగ్లో పెను విషాదం చోటు చేసుకుంది. లీగ్లో భాగంగా క్వెరెటారో, అట్లాజ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రణ రంగాన్ని తలపించింది. ఇరు జట్ల ఆటగాళ్లు విజయం కోసం మైదానంలో పోరాడుతుంటే.. గ్యాలరీలోని ప్రేక్షకులు రెండు వర్గాలుగా విడిపోయి చితక్కొట్టుకున్నారు.
పిడి గుద్దులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్టేడియంలోని కుర్చీలతో రక్తాలు చిందేలా తన్నుకున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం మెక్సికోలోని లా కొర్రెగిడోరా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆట 62వ నిమిషంలో స్టేడియంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. భద్రతా సిబ్బంది ఉన్నా... గొడవను నిలువరించ లేకపోయారు. ఒకరిద్దరి మధ్య చిన్నగా మొదలైన వాదన... ఆ తర్వాత భీకర ఘర్షణకు దారి తీసింది. చేతికి ఏం దొరికితే దాంతో ఇతరులపై దాడులకు దిగారు. దాంతో దాదాపు 26 మంది తీవ్రంగా గాయపడ్డారని, అందులో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని నిర్వాహకులు ప్రకటించారు. ఇందులో ఇద్దరు మహిళల కూడా ఉన్నారు. ఈ గొడవ కారణంగా నిర్వాహకులు మ్యాచ్ను అర్థాంతరంగా నిలిపివేసారు.
ఈ అనూహ్య ఘటనతో ఫ్యామిలీతో మ్యాచ్ చూసేందుకు వచ్చిన వాళ్లంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా ఈ ఘటనపై అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య( ఫిఫా) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్టేడియం నిర్వాహకులకు ఆదేశించింది. ఇక ఈ గొడవకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.