లండన్: యూరోపియన్ చాంపియన్షిప్ 2020 ఫుట్బాల్ టోర్నీ టైటిల్ను ఇటలీ కైవసం చేసకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి పెనాల్టీ షూటౌట్కు దారితీసిన ఫైనల్ మ్యాచ్లో ఇటలీ 3-2 తేడాతో ఇంగ్లండ్పై గెలిచింది. దీంతో 1968 తర్వాత ఇటలీ యూరోకప్ను మరోసారి ముద్దాడింది. గత కొన్నేళ్లుగా మెగా టోర్నీల్లో విఫలమవుతున్న ఇటలీ ఈ విజయంతో ఊపిరి పీల్చుకుంది.
లండన్ వేదికగా అభిమానులు కిక్కిరిసిన వెంబ్లే స్టేడియంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో ఆట అదనపు సమయానికి దాసి తీసింది. అదనపు సమయంలో కూడా ఇరు జట్లు గోల్ చేయకపోవడంతో మ్యాచ్ ఇక పెనాల్టీ షూటౌట్కు మారింది. ఇటలీ 6 అవకాశాల్లో మూడింటిని గోల్స్ చేయగా, ఇంగ్లండ్ రెండింటిని మాత్రమే గోల్గా మలిచింది. దీంతో 55 ఏళ్ల తర్వాత తొలిసారి ఫైనల్కు దూసుకొచ్చి కప్పు కొడుదామన్న ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి.
ఇక ఆటలో తొలి గోల్ ఇంగ్లండ్ చేసినప్పటికీ ఆధిపత్యమంతా ఇటలీదే. ఆట ప్రారంభమైన 2వ నిమిషానికే ఇంగ్లండ్ ఆటగాడు లూక్ షా గోల్చేశాడు. యూరో కప్ ఫైనల్ చరిత్రలో మ్యాచ్ ప్రారంభమైన 2 నిమిషాలకే గోల్ నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో ఇంగ్లండ్ ఆధిక్యంలోకి వచ్చింది. ఇక ఆ ఆధిక్యాన్ని తొలి అర్ధభాగం ముగిసే సమయం వరకు అలాగే కాపాడుకుంది. ఇక 67వ నిమిషంలో ఇటలీ ఆటగాడు లియానార్డో బోనుచి గోల్ చేసి స్కోరును సమం చేశాడు. దీంతో ఆధిపత్యం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఇరు జట్ల రక్షణ శ్రేణి మైదానంలో నువ్వా-నేనా? అన్నట్లు కదిలాయి. దాంతో నిర్ణీత, అదనపు సమయంలో కూడా మరో గోల్ నమోదు కాకపోవడంతో ఇరు జట్లు 1-1తో నిలిచాయి. ఇక పెనాల్టీ షూటౌట్లో గోల్కీపర్ డోనరుమా ఆఖరి బంతిని అద్భుతంగా అడ్డుకొని ఇటలీని విజయతీరాలకు చేర్చాడు.