అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎట్టకేలకు శాంతి పురస్కారం లభించింది. శుక్రవారం వాషింగ్టన్ డీసీలో జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 డ్రా కార్యక్రమంలో ట్రంప్కు ఫీఫా తొలి శాంతి బహుమతి లభించింది. ఈ టోర్నీలో తొలిసారి 48 జట్లు పోటీపడుతుండగా.. నాలుగేసి చొప్పున 12 గ్రూపులుగా విభజించారు. ఈ టోర్నీ డ్రా తీయడానికి ముందు ఫీఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో ఈ శాంతి బహుమతిని ట్రంప్కు ప్రదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు డొనాల్డ్ ట్రంప్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తోన్నట్లు జియాని తెలిపారు.
నెలక్రితమే ఫీఫా ఈ శాంతి బహుమతిని ఆవిష్కరించింది. శాంతి స్థాపన కోసం అసాధారణమైన, విశిష్టమైన చర్యలు తీసుకున్న వ్యక్తులు, తద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసిన వారిని ఈ శాంతి పురస్కారంతో సత్కరిస్తామని అప్పట్లో ఫీఫా ప్రకటించింది. ఫీఫా వరల్డ్ కప్ డ్రా కార్యక్రమం సందర్భంగా దీన్ని వారికి ప్రదానం చేస్తామని అప్పట్లో వెల్లడించింది. ఇందులో భాగంగానే ట్రంప్కు తొలి ఫీఫా శాంతి అవార్డ్ను ప్రదానం చేసింది.

ఈ అవార్డ్ స్వీకరించిన అనంతరం ట్రంప్ మాట్లాడారు. తన జీవితంలోనే ఈ అవార్డ్ అత్యుత్తమమైనదని తెలిపారు. 'నా జీవితంలోనే నాకు దక్కిన అత్యుత్తమమైన గౌరవం ఇది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజల ప్రాణాలను కాపాడాను. ఆ పనికి గుర్తింపుగా ఈ అవార్డ్ దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది మేలో భారత్, పాకిస్థాన్ల మధ్య
కాల్పుల విరమణకు నేను మధ్యవర్తిత్వం వహించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్దాలను ఆపాను. నా జోక్యంతో ఎన్నో యుద్దాలు ఆగిపోయాయి. కొన్ని యుద్దాలను ప్రారంభించకముందే ఆపేసాను. సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతాయని భావించిన యుద్దాలను కూడా ఆగిపోయేలా చేసాను.
నేను అధికారంలోకి రాక ముందు అమెరికాలో పరిస్థితులు బాలేవు. ఇప్పుడు ప్రపంచంలో హాటెస్ట్ దేశంగా అమెరికా మారింది. నాకు బహుమతులు అవసరం లేదు. ప్రజల ప్రాణాలే నా తొలి ప్రాధాన్యత.'అని ట్రంప్ చెప్పుకొచ్చాడు. నొబెల్ శాంతి బహుమతిని ఆశించిన ట్రంప్కు నిరాశే ఎదురైంది. అయితే ట్రంప్ను సంతోషపరిచేందుకు ఫిఫా శాంతి అవార్డ్ను ప్రవేశపెట్టిందనే అభిప్రాయం వ్యక్తమైంది.