
బ్యూనస్ ఏరిస్: ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ డీగో మారడోనా గత ఏడాది నవంబర్లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం అయిన నేపథ్యంలో ఆ దేశ మెడికల్ బోర్డు విచారణ చేపట్టి ఓ నివేదికను తయారు చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం మారడోనాకు చికిత్స అందించిన డాక్టర్లు చాలా నిర్లక్ష్యం వహించారని, అందుకే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏడుగురు వ్యక్తులను విచారిస్తున్నారు.
వారిపై మర్డర్ కేసును కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్లాన్ ప్రకారమే మారడోనాను చంపినట్లు న్యూరోసర్జన్ లియోపోల్డో లుక్యూ, సైకియాట్రిస్ట్ అగస్టినా కొసాచోవ్, సైకాలజిస్ట్ కార్లోస్ డియాజ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ దోషిగా తేలితే వీరికి 25 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.
మెదడులో రక్తం గడ్డకట్టడంతో మారడోనాకు సర్జరీ చేశారు. అయితే ఆ తర్వాత నెల రోజులకు మారడోనా గుండెపోటుతో మరణించాడు. అయితే ఆయన వ్యక్తిగత వైద్యులు సరైన చికిత్స ఇవ్వకపోవడంతో మరణించాడనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. తన తండ్రి మరణంపై సందేహం వ్యక్తం చేస్తూ మారడోనా ఇద్దరు కూతుళ్లు కేసు వేయడంతో ఆ దేశ మెడికల్ బోర్డు విచారణ చేపట్టింది.
మారడోనాను రక్షించేందుకు డాక్టర్లు ఎటువంటి ప్రయత్నం చేయలేదని ప్రాసిక్యూటర్లు ఓ భావనకు వచ్చారు. అయితే చివరి దశలో మారడోనా.. మద్యం, డ్రగ్స్కు బానిసైనట్లు తెలుస్తోంది. మారడోనా చావుబతుకుల మధ్య ఉన్నా.. ఆయన డాక్టర్లు ఆయన్ను పట్టించుకోలేదని మెడికల్ బోర్డు తన నివేదికలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది
1986లో ఒంటి చేత్తో మారడోనా.. అర్జెంటీనాకు ఫుట్బాల్ వరల్డ్కప్ అందించాడు. దాంతో అతను వరల్డ్ ఫేమస్ సాకర్ ప్లేయర్ అయ్యాడు. అయితే మారడోనా ఆస్తి కోసం అయిదుగురు కూతుళ్లు, సోదరులు, లాయర్ మధ్య కూడా వివాదం ఉన్నట్లు తెలుస్తోంది.