వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్లో ఛాంపియన్గా నిలిచి స్వర్ణ పతకాలు అందుకున్న బ్రెజిల్ ఫుట్బాల్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. పారిస్ ఒలింపిక్స్లో విజేతగా నిలిచి హ్యాట్రిక్ సాధించాలనే బ్రెజిల్ ఆశల్ని క్వాలిఫయింగ్ దశలోనే అర్జెంటీనా ఆవిరి చేసింది.
2016, 2020 ఒలింపిక్స్లో ఫురుషుల ఫుట్బాల్ ఛాంపియన్గా నిలిచిన బ్రెజిల్ ఈ ఏడాది జరగనున్న పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించలేకపోయింది. ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్లో ఆడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బ్రెజిల్ 0-1 తేడాతో చిరకాల ప్రత్యర్థి అర్జెంటీనా చేతిలో ఓడిపోయింది.

ఈ గెలుపుతో సౌత్ అమెరికా ఒలింపిక్ ఫుట్బాల్ క్వాలిఫయర్ టోర్నీలో రెండో స్థానంలో నిలిచిన అర్జెంటీనా ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంది. వెనిజులాపై 2-0తో గెలిచిన పరాగ్వే అగ్రస్థానంతో పారిస్ ఒలింపిక్స్ బెర్త్ అందుకుంది. బ్రెజిల్తో పోరులో అర్జెంటీనా అండర్ 23 జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది.
హోరాహోరీగా సాగిన ఈ పోరులో 78వ నిమిషంలో లూసినో గొండో చేసిన గోల్తో అర్జెంటీనా విజయం సాధించింది. బ్రెజిల్ చివరిసారిగా 20 ఏళ్ల క్రితం 2004 ఎథెన్స్ ఒలింపిక్స్కు అర్హత సాధించలేదు. మరోవైపు అర్జెంటీనా 2004, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు సాధించింది.