ఇంగ్లండ్ మాజీ ఫుట్బాల్ కెప్టెన్ సర్ డేవిడ్ బెక్హమ్ సర్కార్ బడిలో సందడి చేశారు. యూనిసెఫ్ గుడ్ విల్ ప్రచారకర్తగా ఉన్న డేవిడ్ బెక్హమ్ విశాఖ పట్నం జిల్లా, కొత్తవలసలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ విద్యాసంస్థల సొసైటీ బాలికల రెసిడిన్షియల్ పాఠశాలను బుధవారం సందర్శించారు.
ఈ స్కూల్లో అమలు చేస్తున్న ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ను పరిశీలించారు. యూనిసెఫ్ గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎడ్యుకేషన్ ఎబౌ ఆల్, మంత్ర4ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా డేవిడ్ బెక్హమ్ భారత పర్యటనకు వచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా, నాగాలాండ్లోని ప్రభుత్వ పాఠశాల పనితీరును మెరుగుపరుస్తున్నారు.
ప్రాజెక్ట్-బేస్డ్ లెర్నింగ్ పద్దతి ద్వారా విద్యార్థులకు కొత్త విషయాలను బోధిస్తున్నారు. ఈ విధానం ద్వారా బట్టి చదవులకు విద్యార్థులను దూరం చేస్తున్నారు. ఈ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించేందుకు బెక్హమ్ కొత్తవలసలోని రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించారు. దాదాపు నాలుగు గంటల పాటు విద్యార్థులు, టీచర్లతో సరదాగా గడిపారు.

తరగతి గదుల్లో కూర్చొని టీచర్ల బోధన తీరును పరీక్షించారు. విద్యార్థుల సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. స్కూల్ లైబ్రరీని సందర్శించి పిల్లలకు ఇష్టమైన పుస్తకాల గురించి తెలుసుకున్నారు. చివర్లో విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు.
ఈ పాఠశాల సందర్శనను ఉద్దేశించి బెక్ హమ్ తన ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. 'భారత్లో నాకు ఇది అద్భుతమైన రోజు. ఎడ్యుకేషన్ ఎబౌ ఆల్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కార్యక్రమాలకు మద్దతుగా పాఠశాలను సందర్శించడం చాలా సరదాగా ఉంది.'అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు.
విశాఖ పర్యటనకు వచ్చిన డేవిడ్ బెక్హమ్కు ఆంధ్ర ప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. 'వైజాగ్ సమీపంలోని కొత్తవలసలో ఉన్న మా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన ఫుట్బాల్ దిగ్గజం బెక్హమ్కు ధన్యవాదాలు. మా విద్యార్థులతో మీరు జరిపిన సంభాషణలు, ఆడిన ఆటలు పాఠశాలకు కొత్త వెలుగులను అందించాయి. బెక్హమ్ లాగా ఫుట్బాల్ను కిక్ చేయడం నేర్చుకొని మా విదార్థులు ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఇవి వారి జీవితాంతం గుర్తుంచుకునే క్షణాలు. పిల్లల విద్య పట్ల మీకున్న నిబద్దతకు మేం ఫిదా అయ్యాం.'అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.