న్యూఢిల్లీ: ఫుట్బాల్ లెజెండ్, పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన సతీమణి జార్జినాకు అప్పుడే పుట్టిన కవలల్లో ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని రొనాల్డో సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 'అప్పుడే పుట్టిన మా బాబు చనిపోయిన విషయం మీతో పంచుకుంటున్నందుకు చాలా బాధగా ఉంది. ఏ తల్లిదండ్రులకైనా ఇది భరించలేని విషాదం. మరో పాప బతికి ఉన్న విషయం ఒక్కటే ఇప్పుడు మాకు కొంత ఆశ, ఆనందాన్ని ఇవ్వగలదు. ఈ సమయంలో మా వెన్నంటి ఉన్న డాక్టర్లు, నర్సులకు ధన్యవాదాలు. ఈ క్లిష్ట సమయంలో మా వ్యక్తిగత గోపత్యకు భంగం కల్పించవద్దని కోరుతున్నాం'అని రొనాల్డో భావోద్వేగపూరితమైన పోస్టును షేర్ చేశాడు.
— Cristiano Ronaldo (@Cristiano) April 18, 2022
ఇప్పటికే జార్జినా- రొనాల్డో జంటకు నలుగురు పిల్లలున్నారు. మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు, కవలలను పుట్టే అవకాశం ఉందని గత అక్టోబర్లో ఈ జంట పేర్కొంది. ఈ ఫుట్బాల్ దిగ్గజం ఎంత బిజీగా ఉన్నప్పటకీ ఏ మాత్రం సమయం దొరికినా తన కుటుంబానికి కేటాయిస్తాడు. తన కుటుంబమే తనకు బలమని ఎప్పటికీ చెబుతుంటాడు. ఇటీవలే పోర్చుగల్ ఈ ఏడాది ఖతార్లో జరిగే ప్రపంచకప్కు అర్హత సాధించింది.
అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రోనాల్డో నిలిచాడు. పోర్చుగల్ కెప్టెన్ అయిన రోనాల్డ్.. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో రెండు గోల్స్ సాధించడంతో ఈ రికార్డు అందుకున్నాడు. రోనాల్డ్ ఖాతాలో ఇప్పుడు 111 అంతర్జాతీయ గోల్స్ ఉన్నాయి. దీంతో ఇరాన్ ఫుట్బాల్ ఆటగాడు అలీ డేయీ పేరిట ఉన్న 109 అంతర్జాతీయ గోల్స్ రికార్డును రోనాల్డో బ్రేక్ చేశాడు.
ఐర్లాండ్తో మ్యాచ్ జరగకముందు ఫుట్బాల్ కెరీర్లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా ఇరాన్కు చెందిన అలీ డేయీ (109)తో సమానంగా క్రిస్టియానో రోనాల్డో ఉన్నాడు. యూరో 2020 ఫుట్బాల్ టోర్నీ ద్వారా అలీ డేయీ రికార్డును అతడు సమం చేశాడు. వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో రెండు గోల్స్ సాధించడంతో అలీ డేయీ రికార్డును బద్దలు కొట్టాడు. 1993 నుంచి 2006 వరకు అలీ డేయీ ఇరాన్ తరపున ప్రాతినిధ్యం వహించాడు.