
కోల్కతా: భారత ఫుట్బాల్ మాజీ కెప్టెన్ సుబిమల్ (చుని) గోస్వామి(82) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోస్వామి.. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం 5 గంటలకి తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా షుగర్తో పాటు నరాల సమస్యతో బాధపడుతున్న గోస్వామికి ఈరోజు ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా గుండెపోటు వచ్చిందన్నారు.
అత్యంత విజయవంతమైన భారత ఫుట్బాల్ కెప్టెన్గా చునీ గోస్వామి గుర్తింపుపొందారు. ఆయన సారథ్యంలోనే 1962 ఆసియా గేమ్స్లో భారత ఫుట్బాల్ జట్టు బంగారు పతకాన్ని గెలిచింది. 1964 ఆసియా గేమ్స్లో రన్నరప్గా నిలిచింది. ఈ ఐకానిక్ ఫుట్ బాల్ ప్లేయర్ బెంగాల్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆడారు. 1956 నుంచి 1964 మధ్య భారత పుట్బాల్ ప్లేయర్గా 50 మ్యాచ్లు ఆడిన గోస్వామి.. 1962 నుంచి 1973 మధ్య బెంగాల్ తరఫున 46 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడాడు.
1938 జనవరి 15న ఉమ్మడి బెంగాల్ రాష్ట్రంలోని కిషోర్ గంజ్(ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది) జిల్లాలో పుట్టిన ఆయన.. 1954లో స్థానిక మోహన్ బగన్ ఫుట్బాల్ క్లబ్ తరఫున తన కెరీర్ను ప్రారంభించాడు. కాలేజీడేస్లో కల్కత్తా యూనీవర్సిటీ ఫుట్బాల్, క్రికెట్ జట్లకు సారథ్యం వహించాడు. ఇక లెజండరీ ప్లేయర్ మృతి పట్ల ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన ఆత్మక శాంతి కలగాలని ట్వీట్ చేసింది.