అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్, కెప్టెన్ లియోనెల్ మెస్సీ కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రతిష్టాత్మక కోపా అమెరికా 2024 ఫుట్ బాల్ టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబియాతో జరిగిన ఫైనల్లో లియోనెల్ మెస్సీ తీవ్రంగా గాయపడ్డాడు. బంతిని పాస్ చేసే క్రమంలో అతని కుడికాలు మెలికపడింది. దాంతో చీలమండకు తీవ్ర గాయమైంది. ఆట 30వ నిమిషంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఫిజియోల సాయంతో ప్రథమి చికిత్స చేసుకున్న మెస్సీ నొప్పితోనే ఆటలో కొనసాగాడు. దాంతో గాయం తీవ్రత ఎక్కువై.. అతని కుడికాలి చీలమండకు వాపు వచ్చింది. ఈ గాయం కారణంగా నడవలేకపోయిన మెస్సీ 64వ నిమిషంలో మైదానం వీడాడు.

గాయంతో మైదానం వీడిన అతను డగౌట్లో కన్నీటిపర్యంతమయ్యాడు. కీలక మ్యాచ్ మధ్యలో ఆటకు దూరమవ్వడాన్ని మెస్సీ తట్టుకోలేకపోయాడు. డగౌట్లో కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ మ్యాచ్లో అర్జెంటీనా 1-0తో కొలంబియాను చిత్తు చేసి కోపా అమెరికా కప్ను కైవసం చేసుకుంది.
నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ నమోదు చేయకపోవడంతో ఫలితం తేలలేదు. దాంతో ఎక్స్ట్రా టైమ్ ఆడించాల్సి వచ్చింది. ఈ అదనపు సమయాన్ని అడ్వాంటేజ్ మార్చుకున్న అర్జెంటీనా గోల్ నమోదు చేసింది. ఫార్వార్డ్ ప్లేయర్ లౌటారో మార్టినెజ్ 112 వ నిమిషంలో అద్భుతంగా బంతిని గోల్ పోస్ట్లోకి పంపించాడు.
ఈ గోల్తో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లిన అర్జెంటీనా చివరి వరకు అదే జోరును కొనసాగించి విజేతగా నిలిచింది. ఈ విజయానంతరం మళ్లీ మైదానంలోకి వెళ్లిన మెస్సీ.. అర్జెంటీనా ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. అభిమానుల అత్యుత్సాహం కారణంగా ఈ మ్యాచ్ గంటన్నర ఆలస్యంగా మారింది.
టికెట్లు లేకుండా వచ్చిన అభిమానులు మైదానంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వారిని అదుపు చేసేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమించాయి. దాంతో ఈ గందరగోళ వాతావరణం నెలకొంది.