కోపా అమెరికా 2024 టోర్నీలో అర్జెంటీనా విజేతగా నిలిచింది. ఆదివారం ఉదయం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో అర్జెంటీనా 1-0తో కొలంబియాపై విజయం సాధించింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో విజయం అర్జెంటీనానే వరించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ నమోదు చేయకపోవడంతో ఫలితం తేలలేదు. దాంతో ఎక్స్ట్రా టైమ్ ఆడించాల్సి వచ్చింది.
ఈ అదనపు సమయాన్ని అడ్వాంటేజ్ మార్చుకున్న అర్జెంటీనా గోల్ నమోదు చేసింది. ఫార్వార్డ్ ప్లేయర్ లౌటారో మార్టినెజ్ 112 వ నిమిషంలో అద్భుతంగా బంతిని గోల్ పోస్ట్లోకి పంపించాడు. ఈ గోల్తో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లిన అర్జెంటీనా చివరి వరకు అదే జోరును కొనసాగించి విజేతగా నిలిచింది.

ఈ మ్యాచ్లో ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. ఫస్టాఫ్లో హోరాహోరీగా తలపడటం.. గోల్ కీపర్స్ సమర్థవంతంగా అడ్డుకోవడంతో గోల్స్ నమోదు కాలేదు. సెకండాఫ్లోనూ ఇరు జట్లు అదే జోరును కొనసాగించాయి.
గాయంతో లియోనల్ మెస్సీ ఆట మధ్యలోనే తప్పుకున్నా అర్జెంటీనా విజేతగా నిలిచింది. ఫస్టాఫ్ లీగ్లో మెస్సీ కుడికాలి చీలమండకు గాయమైంది. దాంతో అతను నొప్పితో విలవిల్లాడాడు. ఆట 30వ నిమిషంలో మెస్సీ గాయపడ్డాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. ఆ నొప్పితోనే ఆటను కొనసాగించాడు. నొప్పి తీవ్రం కావడంతో 64వ నిమిషంలో అతను మైదానాన్ని వీడాడు.
ఆటకు దూరమైన బాధలో డగౌట్లో కూర్చొని కన్నీటి పర్యంతమయ్యాడు. విజయానంతరం మళ్లీ మైదానంలోకి వచ్చిన మెస్సీ.. అర్జెంటీనా ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకున్నాడు.
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు అభిమానులు గందరగోళం సృష్టించారు. టికెట్లు లేకుండా వచ్చిన అభిమానులు మైదానంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వారిని అదుపు చేసేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమించాయి. దాంతో ఈ ఫైనల్ మ్యాచ్ గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది.