న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్కు భారత ఫుట్బాల్ జట్టును అనుమతించేలా చొరవ తీసుకోవాలని హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాచ్ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశాడు. 2002 నుంచి ఆసియా గేమ్స్లో అండర్ 23 ఫుట్బాల్ను ఆడిస్తున్నారు. అయితే జట్టుగా తలపడే క్రీడాంశాల్లో ఆసియాలో టాప్-8 లోపు ఉన్న భారత జట్లనే ఆసియా క్రీడలకు పంపిస్తామని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఇటీవల పేర్కొంది.
దీంతో 18వ ర్యాంకులో ఉన్న భారత ఫుట్బాల్ జట్టును పంపేందుకు నిరాకరించింది. ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన భారత ఫుట్బాల్ జట్టు కోచ్ స్టిమాక్.. సోషల్ మీడియా వేదికగా భారత ప్రధానికి తన ఆవేదనను తెలియజేశాడు. 'గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్ల గురించి ఎవరైనా మీకు సమాచారమిచ్చారో లేదో తెలీదు.

కానీ ఎంతో ముఖ్యమైన ఫుట్బాల్ జట్టు భారత్ తరపున బరిలో దిగే అవకాశం కోల్పోయింది. 2017లో భారత్లో అండర్-17 ప్రపంచకప్ నిర్వహించారు. కొత్త తరం ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఎంతో ఖర్చు చేశారు. ఫిఫా ప్రపంచకప్లో ఆడేలా భారత్ ఎదగాలని మీరు కోరుకుంటున్నారు. గత నాలుగేళ్లుగా భారత ఫుట్బాల్ జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది.
అత్యుత్తమ ఫలితాలు రాబడుతోంది. ఫ్రాన్స్ పర్యటనలో ఫుట్బాల్, ఎంబాపె గురించి మీరు గొప్పగా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఆసియా క్రీడల్లో మన జట్టు పాల్గొనకుండా అనవసర నిబంధనలతో సొంత మంత్రిత్వ శాఖనే అడ్డుపడుతోంది. ఈ విషయాన్ని మీతో పాటు క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నా.
వాస్తవానికి మన కంటే తక్కువ ర్యాంకున్న ఇతర దేశాలు జట్లను బరిలో దింపుతున్నాయి. అందుకే ఫుట్బాల్ వర్గం తరపున మన జట్టును ఆసియా క్రీడల్లో ఆడించాలని మిమ్మల్ని కోరుతున్నా. మన జట్టుకు ఆ అర్హత ఉంది . మువ్వెన్నల జెండాను రెపరెపలాడేలా విజయం సాధిస్తాం. జైహింద్.'అని స్టిమాక్ ఓ సుదీర్ఘ పోస్టును ప్రధాని నరేంద్ర మోదీ, పీఎంవోకు ట్యాగ్ చేస్తూ షేర్ చేశాడు.
స్టిమాక్ విన్నపంపై అటు ప్రధాని కానీ,ఇటు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కానీ స్పందించలేదు. ఫుట్బాల్ అభిమానులు మాత్రం అనురాగ్ ఠాకూర్పై మండిపడుతున్నారు. అర్థం పర్థం లేని నిబంధన అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.