హంగ్జౌ: ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్ను భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ఘోర పరాజయంతో ఆరంభించింది. మంగళవారం ఆతిథ్య చైనాతో జరిగిన మ్యాచ్లో భారత్ 1-5 తేడాతో చిత్తు అయ్యింది. ప్రయాణం చేసి అలసిపోవడం, సరైన సన్నద్ధతలేమి, వేడి వాతావరణం కారణంగా సునీల్ ఛెత్రీ సారథ్యంలోని భారత ఆటగాళ్లు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు.
భారత్ తరఫున రాహుల్ కేపీ (45+1) నిమిషంలో ఏకైక గోల్ చేయగా... ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. చైనా ఆటగాళ్లు మాత్రం ఐదు గోల్స్తో భారత్ పతనాన్ని శాసించారు.

రాహుల్ కేపీ గోల్ చేయడంతో ఆట మొదటి అర్ధ భాగం 1-1తో ముగిసింది. రెండో అర్ధ భాగంలో చైనా ఆటగాళ్లు ఏకంగా నాలుగు గోల్స్ చేశారు. ఆతిథ్య జట్టు తరఫున గియావో తియానీ (17 నిమిషం), డై వీజున్ (51 నిమిషం), టావో కియాంగ్లాంగ్ (72, 75 నిమిషం), హావో ఫాంగ్ (90+1 నిమిషం)లో గోల్స్ చేశారు.
భారత గోల్ పోస్ట్లోకి పదే పదే దూసుకొచ్చిన చైనా ఆటగాళ్లు వరుస గోల్స్తో రెచ్చి పోయారు. ఉక్కపోత వాతావరణంలో తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొన్న భారత ఆటగాళ్లు.. చైనా ఆటగాళ్ల దూకుడుకు అడ్డు వేయలేకపోయారు.
86 నిమిషాలు మైదానంలో ఉన్నా కెప్టెన్ సునీల్ ఛెత్రి ఏమి చేయలేక చూస్తుండిపోయాడు. జట్టులోని 8 మంది ఆటగాళ్లు మొత్తం 90 నిమిషాలు ఫీల్డ్లో ఉండటం పరిస్థితిని చూపిస్తోంది. భారత్ రెండో రౌండ్కు అర్హత సాధించాలంటే మిగిలిన రెండు మ్యాచ్ల్లో బంగ్లాదేశ్, మయన్మార్లను ఓడించాలి.
ఏషియన్ గేమ్స్లో భారత ఫుట్బాల్ జట్టు పాల్గొనడంపైనే వివాదం నెలకొంది. ఫుట్బాల్ జట్టును పంపించడం లేదని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించగా.. టీమ్ కోచ్ నేరుగా ప్రధానికి విజ్ఞప్తి చేశాడు. దాంతో ఫుట్బాల్ టీమ్ బరిలోకి దిగడంపై గ్రీన్ సిగ్నల్ రాగా.. అత్యుత్తమ ఆటగాళ్లను ఇవ్వలేమంటూ ఐఎస్ఎల్ జట్లు అడ్డు తగిలాయి. చివరి నిమిషంలో తృతీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన భారత్.. కనీసం ప్రాక్టీస్ లేకుండానే 16 గంటలో వ్యవధిలోనే తొలి మ్యాచ్ ఆడింది.
కనీసం టీమ్ జెర్సీలపై ఆటగాళ్ల పేర్లు కూడా రాసుకోలేని దుస్థితి. సబ్స్టిట్యూట్లుగా దించేందుకు తగినంత మంది కూడా బెంచీపై లేరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అధికారికంగా ఆసియా క్రీడలు ఈ నెల 23 నుంచి ప్రారంభం అవుతున్నా.. కొన్ని ఈవెంట్స్ ముందే మొదలయ్యాయి.