ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ దీపక్ శర్మపై వేటు పడింది. తాగిన మైకంలో మహిళా ప్లేయర్లను కొట్టాడనే ఆరోపణల నేపథ్యంలో ఏఐఎఫ్ఎఫ్ అతనిపై కఠిన చర్యలు తీసుకుంది.
ఇండియన్ ఉమెన్స్ లీగ్(ఐడబ్ల్యూఎల్)-2 కోసం ఖాద్ ఫుట్బాల్ క్లబ్ ప్రస్తుతం గోవాలో ఉన్నది. దీపక్ శర్మ ఏఐఎఫ్ఎఫ్ కాంపిటిషన్ కమిటీ డిప్యూటీ చైర్మన్గా.. హిమాచల్ ప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాడు. దీపక్ శర్మ తమపై దాడి చేసినట్టు ఇద్దరు క్రీడాకారిణులు శనివారం ఏఐఎఫ్ఎఫ్కు ఫిర్యాదు చేశారు.

'గురువారం రాత్రి డిన్నర్ లేకపోవడంతో మేం మా రూమ్లో గుడ్లు ఉడకపెట్టుకునేందుకు వెళ్లాం. ఈ విషయంపై ఆగ్రహానికి గురైన దీపక్ శర్మ మా రూమ్లోకి వచ్చి మాపై దాడి చేశాడు. అప్పుడు అతను మద్యం మత్తులో ఉన్నాడు. హిమాచల్ ప్రదేశ్ నుంచి గోవాకు వస్తుండగా కూడా మా ముందే మద్యం తాగాడు.'అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమకు ప్రాణహాని ఉందని, ఏఐఎఫ్ఎఫ్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో వెంటనే స్పందించిన గోవా ఫుట్బాల్ అసోసియేషన్ మపుసా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శనివారం దీపక్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే.. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. దీపక్ శర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్ఎఫ్ను ఆదేశించారు.
దాంతో ఏఐఎఫ్ఎఫ్ అతనిపై నిషేధం విధిస్తూ కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఏఐఎఫ్ఎఫ్ ఓ ప్రకటనను విడుదల చేసింది. మహిళా ఫుట్బాల్ను మరింత ప్రోత్సహించే దిశగా ఏఐఎఫ్ఎప్ అడుగులు వేస్తోంది. ప్లేయర్ల సమస్యల విషయంలో తమ ఫెడరేషన్ కఠినంగా ఉంటుందని స్పష్టం చేసింది.