ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పని చేస్తోన్న డీనూ అలెక్స్
వివరాల్లోకి వెళితే కొట్టాయం జిల్లా అర్మనూర్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల డీనూ అలెక్స్ ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పని చేస్తున్నాడు. లియోనల్ మెస్సీకి వీరాభిమాని. అర్జెంటీనా-క్రొయేషియా మ్యాచ్ని టీవీలో వీక్షించిన అతడు ఈ మ్యాచ్లో క్రొయేషియా చేతిలో అర్జెంటీనా ఘోర పరాభవాన్ని చవిచూడడంతో అతను తట్టుకోలేకపోయాడు.
ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నా
దీంతో మనస్థాపం చెందిన డీనూ "నా ఫెవరెట్ జట్టు ఓడింది. మెస్సీ దారుణంగా నిరుత్సాహపరిచాడు. నాకు ఈ ప్రపంచంలో చూసేందుకు ఇంకా ఏం మిగల్లేదు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదంటూ" అంటూ మళయాళంలో ఓ లేఖ రాసి పెట్టి వెళ్లిపోయాడు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడి తల్లిదండ్రులు
శుక్రవారం ఉదయం నుంచి తమ కుమారుడు కనిపించకుండా పోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీనూ గదిలో అర్జెంటీనా జెర్సీ, పుస్తకాల్లో, గోడల మీద మెస్సీ ఫోటోలు, అభిమాన రాతలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డాగ్ స్క్వాడ్ సాయంతో ఆ చుట్టుపక్కల గాలింపు చేట్టారు.
సెర్చ్ ఆపరేషన్కు విఘాతం
ప్రస్తుతం కేరళలో భారీగా వర్షాలు కురవడంతో సెర్చ్ ఆపరేషన్కు విఘాతం ఏర్పడింది. బహుశా మీనాచిల్ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే, క్రొయేషియా చేతిలో అర్జెంటీనా జట్టు ఓటమి పాలవ్వడాన్ని అర్జెంటీనా మీడియా ఘోర అవమానంగా అభివర్ణించింది. ‘‘క్రొయేషియా చేతిలో ఓటమి తీరని విషాదం. అర్జెంటీనా నిరాశపరిచింది. ప్రపంచకప్ నుంచి నిష్క్రమంచే స్థితిలో నిలిచింది'' అని ఓ పత్రిక తన వెబ్సైట్లో కథనంగా రాసుకొచ్చింది.