
హరారే: తమీమ్ ఇక్బాల్(97 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 112) సెంచరీతో చెలరేగడంతో జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ అద్భుత విజయాన్నందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్లో సమష్టిగా రాణించి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 298 పరుగులకు ఆలౌటైంది. రెగిస్ చకబ్వా(84), సికందర్ రాజా(57), ర్యాన్ బర్ల్(59) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సైఫుద్దీన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మదుల్లా రెండు, షకీబ్ అల్ హసన్, టస్కిన్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 299 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సెంచరీ ధాటికి 48 ఓవర్లలో 5 వికెట్లకు 302 పరుగులు చేసి మరో 12 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. తమీమ్కు అండగా.. షకీబ్ అల్ హసన్(30), మహమ్మద్ మిథున్(30), నురుల్ హసన్(45), లిటన్ దాస్(32) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో వెస్లీ, డోనాల్డ్ రెండేసి వికెట్లు తీయగా.. లుక్ జాంగ్వే ఓ వికెట్ పడగొట్టాడు. బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించిన తమీమ్ ఇక్బాల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.