
హరారే: జింబాబ్వే గడ్డపై బంగ్లాదేశ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా.. మూడు టీ20ల సిరీస్లోను బోణీ కొట్టింది. గురువారం జరిగిన తొలి టీ20లో ఆల్రౌండ్ షోతో సత్తాచాటిన బంగ్లా 8 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 19 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రెగిస్ చకబ్వా(22 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43), డియోన్ మైర్స్(22 బంతుల్లో 2 ఫోర్లతో 35) రాణించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(3/31) మూడు వికెట్లతో చెలరేగగా.. మహమ్మద్ సైఫుద్దీన్(2/23), షోరిఫుల్ ఇస్లామ్(2/17) రెండేసి వికెట్లు పడగొట్టారు. సౌమ్య సర్కార్, షకీబ్ అల్ హసన్ చెరొక వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ ఆడుతూ పాడుతూ 18.5 ఓవర్లలో 2 వికెట్లకు 153 రన్స్ చేసి 7 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు మహమ్మద్ నైమ్(51 బంతుల్లో 6 ఫోర్లతో 63 నాటౌట్), సౌమ్య సర్కార్(45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ మ్యాచ్లో జింబాబ్వే బౌలర్లు ఒక్క వికెట్ తీయలేకపోవడం గమనార్హం. బంగ్లా రెండు వికెట్లు కూడా రనౌట్ రూపంలోనే కోల్పోయింది. ఓ వికెట్తో పాటు హాఫ్ సెంచరీ సాధించిన సౌమ్య సర్కార్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారమే జరగనుంది.