
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ బరిలోకి దిగే టీమిండియా బౌలింగ్ లైనప్లో స్వల్ప మార్పులు చేయాలని భారత దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ సూచించాడు. రవీంద్ర జడేజా అందుబాటులో ఉన్నా.. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను కచ్చితంగా జట్టులోకి తీసుకోవాలన్నాడు. ఎందుకంటే ఓవల్ పిచ్ స్పిన్ బౌలింగ్కు చక్కగా అనుకూలిస్తుందని.. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో అశ్విన్, జడేజాలిద్దరినీ బరిలోకి దించినట్లుగానే ఇక్కడ కూడా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలన్నాడు. ఇక మూడు టెస్ట్ల్లో ఆడిన యువ పేసర్ మహమ్మద్ సిరాజ్కు విశ్రాంతిచ్చి శార్దూల్ ఠాకూర్ను తీసుకోవాలన్నాడు.
'ఓవల్ పిచ్ స్పిన్కు సహకరిస్తుంది. ఇటీవల ఇక్కడ జరిగిన కౌంటీ చాంపియన్షిప్లో 5 మ్యాచుల్లో స్పిన్నర్లు 59 వికెట్లు తీశారు. హెడింగ్లే టెస్టులో విఫలమైన సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మను తప్పించి అతడి స్థానంలో అశ్విన్ను తీసుకుంటారు అనుకున్నా. అలాగే, మూడు టెస్టుల్లో కలిపి 13 వికెట్లు తీసిన యువ పేసర్ మహమ్మద్ సిరాజ్కు విశ్రాంతి ఇవ్వాలి. పని భారం దృష్ట్యా యాజమాన్యం అతడి స్థానంలో శార్దుల్ ఠాకూర్ను జట్టులోకి తీసుకోవాలి. శార్దుల్ బంతితో పాటు బ్యాటుతోనూ సత్తా చాటగలడు. దీంతో భారత బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుంది'అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. గురువారం మధ్యాహ్నం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది.
బ్యాటింగ్ వైఫల్యంతోనే గత మ్యాచ్లో భారత్ మూల్యం చెల్లించుకున్న నేపథ్యంలో రేపటి మ్యాచ్లో కోహ్లీ సేన ఎక్స్ట్రా బ్యాట్స్మన్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే హనుమ విహారి లేక సూర్యకుమార్ యాదవ్లో ఒకరు తుది జట్టులోకి రానున్నారు. ఇక ఇషాంత్ శర్మ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ రావడం ఖాయమైంది. అయితే మూడో టెస్ట్లో గాయపడి కోలుకున్న రవీంద్ర జడేజాకు విశ్రాంతినిస్తారా? లేక కొనసాగిస్తారా? అనేది చూడాలి. ఐదు టెస్ట్ల సిరీస్లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవగా.. ఫస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది.