
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా కచ్చితంగా ఫైనల్ చేరుతుందని మాజీ పేసర్ జహీర్ ఖాన్ అన్నాడు. జస్ప్రీత్, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు దూరమైనా.. టీమిండియా మెరుగైన ప్రదర్శననే కనబరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా క్రిక్బజ్ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న జహీర్ ఖాన్.. మెగా టోర్నీ నేపథ్యంలో తన అంచనాలను వెల్లడించాడు. ఈ టోర్నీలో ఫైనల్కు చేరే జట్లలో టీమిండియా, ఇంగ్లండ్ ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.
'ఫైనల్ చేరే జట్లలో టీమిండియా ఉంటుందనేది నా గట్టి నమ్మకం. జట్టుకు కీలక ఆటగాళ్లు దూరమైన మాట వాస్తవమే. బుమ్రా వంటి బౌలర్లు లేకపోవడం వల్ల పరిస్థితి ఎలా ఉంటుందో అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ భారత్ కొన్నేళ్లుగా ఎంతో స్థిరంగా ఆడుతోంది. మన జట్టు ప్రపంచకప్లో బలమైన ప్రత్యర్థిగా నిలుస్తుంది. భారత్ తర్వాత ఇంగ్లండ్ నుంచి ఆ స్థాయి పోటీ ఉంటుంది. ఈ రెండూ ఫైనల్కు వెళ్తాయని నేను భావిస్తున్నాను'' అని జహీర్ తెలిపాడు. ఇక ఈ మెగా టోర్నీ సూర్యకుమార్ యాదవ్ టాప్ స్కోరర్గా నిలుస్తాడని జోస్యం చెప్పాడు.
ప్రస్తుతం అతను సూపర్ ఫామ్లో ఉన్నాడని, మైదానం నలువైపుల ఆడే సామర్థ్యం ఉండటం కలిసొచ్చే అంశమని తెలిపాడు. మరోవైపు కపిల్ దేవ్, హర్షా భోగ్లేలు మాత్రం భారత్కు ప్రపంచకప్ గెలిచేంత సీన్ లేదని కామెంట్ చేశారు. జట్టు బౌలింగ్ బలహీనంగా ఉందని, సెమీస్ చేరడం కూడా కష్టమేనని తెలిపారు. బ్యాటర్లు మ్యాచ్లు గెలిపించగలరని, బౌలర్లు టోర్నీలు గెలిపిస్తారని చెప్పారు.
ఆదివారం పాకిస్థాన్తో జరగనున్న తొలి మ్యాచ్ కోసం టీమిండియా గురువారం మెల్బోర్న్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించవచ్చని అభిమానుల్లో కలవరం మొదలైంది. లానినా తుఫాను ప్రభావం కారణంగా ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత్ X పాక్ మ్యాచ్ జరిగే ఆదివారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.